ట్రేడ్ టాక్: హిట్ కోసం బాక్సాఫీస్ వెయిటింగ్

''సోమవారం'' ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కోలుకోలేదు. లాక్ డౌన్ తర్వాత చేదు అనుభవాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ మొదలైంది. థియేటర్లు తెరిచిన తర్వాత తిమ్మరుసు, ఇష్క్ తో పాటు ఏకంగా…

''సోమవారం'' ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కోలుకోలేదు. లాక్ డౌన్ తర్వాత చేదు అనుభవాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ మొదలైంది. థియేటర్లు తెరిచిన తర్వాత తిమ్మరుసు, ఇష్క్ తో పాటు ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడీ 5 సినిమాలు వీకెండ్ ముగిసేనాటికి దుకాణం సర్దేశాయి.

తిమ్మరుసుకు మొదటిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండో రోజు పుంజుకుంది. దీంతో ఇది మెల్లగా అందుకుంటుందని అంతా అనుకున్నారు. నిన్నటి ఆక్యుపెన్సీ/వసూళ్లతో ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అనే విషయం పక్కా అయింది. సత్యదేవ్ నటించిన ఈ సినిమా ఇక కోలుకునే అవకాశం లేదు.

ఇష్క్ సినిమా అయితే రెండో రోజుకే పడిపోయింది. తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే మౌత్ టాక్ బాగాలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్లిష్ట పరిస్థితులకు ఈ బ్యాడ్ మౌత్ టాక్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా వీకెండ్ లో కూడా ఆడలేదు. ఇక నిన్నటి పరిస్థితి అయితే మరీ ఘోరం.

ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన నరసింహపురం, త్రయం, పరుగెత్తు-పరుగెత్తు సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. నరసింహపురం సినిమాకు అనంతపురం, విశాఖ, చిత్తూరులోని కొన్ని మాస్ థియేటర్లలో కలెక్షన్లు వచ్చినట్టు కనిపించినప్పటికీ.. అంతలోనే ఆ సినిమా ఆశలు కూడా ఆవిరయ్యాయి.

ఇవాళ్టి నుంచి బాక్సాఫీస్ ఖాళీ. మళ్లీ మరో శుక్రవారం వరకు బాక్సాఫీస్ ఎదురుచూడాల్సిందే. ఈ వారాంతం ఎస్ఆర్ కల్యాణమండపం, క్షీరసాగరమధనం, మెరిసే మెరిసే లాంటి సినిమాలొస్తున్నాయి.