కాకి లెక్కలు చెప్పడంలో ఆ పార్టీ ఘనాపాటి

కాకి లెక్కలు చెప్పడంలో కాని,పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడంలో కాని ఆంద్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ను మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు.  Advertisement ఒక వైపు సొంత పార్టీ వారు…

కాకి లెక్కలు చెప్పడంలో కాని,పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడంలో కాని ఆంద్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ను మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. 

ఒక వైపు సొంత పార్టీ వారు తప్పు చేసినా సమర్దిస్తారు. మరో వైపు ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రతిపాదనతో ముందుకు వెళుతుంటే ఏదో రకంగా అడ్డం పడడానికి విశ్వయత్నం చేస్తుంటారు. అదే రాజకీయం అని వారు నమ్ముతున్నారు. వారికి ఒక ఎమ్.పి తోడయ్యారు. ఆయన వారికి ఉపయోగపడుతున్నారు. 

అమూల్ తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఎపి హైకోర్టులో పిల్ పడింది. దానిపై హైకోర్టు వారు ఇచ్చిన తాత్కాలిక తీర్పు వారికే కొంతవరకు అనుకూలంగా ఉండవచ్చు.అది వేరే విషయం. ఎపిలో మూతపడిపోయిన సహకార డయిరీలను పునరుద్దరించడానికి, వాటి ద్వారా రైతులకు మరింత మేలు కలిగేలా చేయడానికి ఎపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రైతుల సంస్థ అయిన అమూల్ తో ఎపి ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. అందులో భాగంగా కొన్ని ప్లాంట్ లను, ఇతర సదుపాయాలను అమూల్ కు లీజ్ ప్రాతిపాదికన కేటాయించారు. దీనిని తెలుగుదేశం తప్పుపడుతోంది. 

ఇదే తరుణంలో తమ పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి దానిని తన సొంత కంపెనీ మాదిరిగా నడుపుకుంటున్నారన్న అభియోగాన్ని సమర్దిస్తుంటారు. ఆయన వేరే ప్రైవేటు కంపెనీని నడుపుతూ సహకార డెయిరీని ప్రొడ్యూసర్  కంపెనీగా మార్చుకున్నా, తన తండ్రి పేరుమీద ఒక ట్రస్టు పెట్టి, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులనే యాజమాన్యబాద్యతలలో పెట్టి, సంగం డెయిరికి చెందిన పదెకరాల భూమిని బదలాయించినా టిడిపి వారు సమర్దిస్తారు. ఇదే వారి గొప్పదనం. 

వీరు ఏదో ఒక విదానానికి కట్టుబడి ఉండరు. తమకు ఎక్కడ ఏది అవసరమో ఆ వాదనను తెరైకి తీసుకువస్తుంటారు. తద్వారా వారు తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటారు. ఆయినా ప్రజలు వాటిని గమనించలేరని వారి నమ్మకం. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, అంతకుముందు కాని మూత పడిన సహకార డైరీలను ఇప్పుడు అమూల్ కు అప్పగించడంలో కుంభకోణం ఉందని టిడిపి నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. టిడిపి మీడియా దానికి ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇస్తుంటుంది. నిజంగానే స్కామ్ ఉందని అనుకుంటే ఆ మీడియానే పరిశోధించి వార్తలు ఇవ్వవచ్చు కదా? కేవలం టిడిపి వారి ఆరోపణలనే ప్రముఖంగా ఇచ్చారంటేనే వాటిలో ఎంత నిజం ఉందన్న ప్రశ్న వస్తుంది. 

మూత పడ్డ సహకార డైరీలలోని యంత్రాల విలువ 550కోట్లుగా వీరు లెక్కవేశారు. అలాగే భవనాలు, భూముల విలువ 750 కోట్లుగా గణించారు. రాష్ట్రంలోని 9800 గ్రామాలలో బల్క్ కూలర్లు ఖర్చు చేయడాన్ని వీరు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కూలర్ల కోసం ఖర్చు పెడితే అది ఆస్తి అవుతుందా?లేదా? మూతపడ్డ డెయిరీ ప్లాంట్లను తెరచి పనిచేయించేందుకు అమూల్ కు తక్కువ మొత్తానికే లీజుకు ఇచ్చారని, టిడిపి ప్రచారం ఆరంబించింది. అంటే తెలుగుదేశం పార్టీ వారు ఈ సహకార డెయిరీ లు మూతపడి, యంత్రపరికరాలన్ని తుప్పుపట్టినా, భవనాలు శిధిలావస్థకు చేరినా ఫర్వాలేదు కాని, అమూల్ వంటి రైతుల సంస్థ లకు అప్పగించి బాగు చేయించడం ఇష్టం లేదన్నమాట. 

నిజానికి పాల పరిశ్రమ రంగంలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు టైమ్ లోనే వాటిని పునరుద్దరించడానికి ప్రయత్నం జరిగి ఉండాల్సింది. కాని ఆయన వాటిని పట్టించుకోలేదు. మరి దీనికి చంద్రబాబుకు సొంతంగా హెరిటేజ్ పాల సంస్థ ఉండడమే కారణమని ఎవరైనా ఆరోపిస్తే టిడిపి వారు అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రభుత్వం వీటిని పునరుద్దరించడానికి చర్యలు చేపడితే తప్పు పడతారా? మరి వీరే ధూళిపాళ్ల నిర్వాకాన్ని ఎలా అంగీకరిస్తారు? ఆయన అరెస్టును రాజకీయ కక్షగా ఎలా ప్రచారం చేస్తారు. 

ఆయన రైతుల శ్రేయస్సే ప్రధానంగా పనిచేసి ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. కాని అలా జరగడం లేదన్నది విమర్శ. సహకార రంగంలోని డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి సొంత సంస్థలా ధూళిపాళ్ల నడపడం సరైనదా?కాదా అన్న విషయం వీరు ఎందుకు చెప్పడం లేదు. పైగా ఆయనే మరో ప్రైవేటు డెయిరీని నడుపుకోవచ్చా? అది తప్పా? కాదా? అన్నదానిపై టిడిపి నేతలు మాట్లాడరు. 

టిడిపి టైమ్ లోనే కదా..విశాఖ సహకార డైరీ కూడా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. మరో వైపు అమూల్ ఏడాదికి వంద కోట్ల రూపాయలు అయినా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో హేతుబద్దత ఎంత ఉందన్నది వారికి అనవసరం. నిజంగానే ప్రభుత్వానికి అమూల్ ఇంకాస్త చెల్లించాలని అడిగితే అడగవచ్చు. కాని అసాదారణ డిమాండ్ చేయడమే ఆక్షేపణీయం. అందుకే టిడిపి వారివి కాకి లెక్కలు అనేది. 

అమూల్ సంస్థ రైతుల సహకార సంస్థ కాదని తెలుగుదేశం చెప్పగలదా? వారు స్కాములకు అవకాశం ఇస్తారా అన్నదానిపై టిడిపి ఆరోపణ చేయగలదా? దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరొందిన అమూల్ సేవలను ఎపిలో ప్రవేశపెడితే టిడిపి నేతలకు ఉలికిపాటు దేనికి? తమ అధినేత కంపెనీకి లాబాలు తగ్గుతాయని వీరు ఆందోళన చెందుతున్నారా? అమూల్ కంటే ఎక్కువ మొత్తం లో రైతులకు చెల్లిస్తామని మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదట. 

టిడిపి వారి మాటల్లోని మతలబు తెలుసుకోవడం కష్టం కాదు. చంద్రబాబు టైమ్ లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజ్ అయ్యాయి. వాటిలో నిజాం సుగర్స్ ఒకటి.వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఈ సంస్థను ప్రత్యేకించి బోధన్ లో ఉన్న ఆస్తులను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అది కొన్నాళ్లు నడిపి చేతులెత్తేసింది. అంతే ఆ తర్వాత అది మూతపడింది. మళ్లీ ఇంతవరకు తెరుచుకోలేదు. ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ సంతోషిస్తుందా? 

అమూల్ రంగంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు జరిగిందా?లేదా? హెరిటేజ్ తో సహా ఆయా ప్రైవేటు డైరీలు రైతులు సరఫరా చేసే పాలకు ఇస్తున్నధరను పెంచాయా?లేదా ? వీటిని పరిగణనలోకి తీసుకోకుండా టిడిపి పెద్ద నేతలు చెబితే చోటా మోట నేతలు వారి అనుకూల టీవీలలో కూర్చుని ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే టిడిపి వారు విద్వంసం కోరుకుంటున్నారన్న సంగతి అర్దం అయిపోతుంది. 

ఒక పక్క పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తూ, మరో పక్క వచ్చిన ఒక భారీ పరిశ్రమను అడ్డుకోవడానికి టిడిపితో సహా కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయన్న విమర్శ వస్తోంది. టిడిపి వారు గుడ్డి ద్వేషంతో ప్రతిదానిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు మూల్యం చెల్లించుకున్నారు. అయినా వారి ఆలోచనలలో మార్పు రావడం లేదు. 

ముందుగా టిడిపి వారు ఇలాంటి విషయాలలో ఒక విధానం తయారు చేసుకుని మాట్లాడాలి.లేకుంటే పోయేది వారి పరువే. ధైర్యం ఉంటే మూతపడ్డ సహకార డెయిరీ ప్లాంట్లను తెరవవద్దని వీరు చెప్పగలరా?కాని ఆరోపణలు మాత్రం చేస్తుంటారు.ఇదే దిక్కుమాలిన రాజకీయం.

కొమ్మినేని శ్రీనివాసరావు