రెండు తీర్పులు- పలు సంధేహాలు

ఎపిలో ఎమ్.పి.టి.సి , జడ్పిటిసి ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం, నరసాపురం ఎమ్.పి రఘురామరాజుకు సుప్రింకోర్టు కఠిన షరతులతో బెయిల్ ఇవ్వడం..ఈ రెండు ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ కేసులలో వచ్చిన నిర్ణయాల పై…

ఎపిలో ఎమ్.పి.టి.సి , జడ్పిటిసి ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం, నరసాపురం ఎమ్.పి రఘురామరాజుకు సుప్రింకోర్టు కఠిన షరతులతో బెయిల్ ఇవ్వడం..ఈ రెండు ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ కేసులలో వచ్చిన నిర్ణయాల పై ప్రజలలో పలు సందేహాలు కూడా ఏర్పడ్డాయి.

ఎపిలో స్థానిక ఎన్నికలు గత ఏడాదికాలంగా నలుగుతున్నాయి. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతి చర్యను న్యాయవ్యవస్థ దాదాపు సమర్ధించింది. ఆయన కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వేస్తే, ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా కమిషన్ నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానాలు ప్రకటించాయి. 

తిరిగి కరోనా కేసులు వేల సంఖ్యలో వస్తున్న సమయంలో నిమ్మగడ్డ ఎన్నికలు పెడుతున్నట్లు ప్రకటించారు. కరోనా తీవ్రంగా ఉందని, వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తే ఒక్క సింగిల్ బెంచ్ కోర్టు తప్ప,డివిజన్ బెంచ్, సుప్రింకోర్టు కూడా ఎన్నికల కమిషనర్ చర్యనే సమర్ధించాయి. అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయాలలో జోక్యం చేసుకోబోమని అన్నారు.

అయితే నిమ్మగడ్డ ముందుగా పెట్టవలసిన ఎమ్.పిటిసి, జడ్పిటిసి ఎన్నికలను కాకుండా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు.దానికి ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు.ఆ ఎన్నికలలో అత్యధికంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది.

కారణం ఏమైనా నిమ్మగడ్డ ఎమ్.పి.టి.సి, జడ్పిటిసి ఎన్నికలు పెట్టలేదు సరికదా ..ఎన్నికల కోడ్ ను కుట్రపూరితంగా ఎత్తివేశారు. ఆ తర్వాత వారం రోజులకు కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహానీ రావడం, ఆమె అదే రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికలకు సిద్దం అవడం జరిగాయి. ఇక్కడే విపక్షాలు లిటిగేషన్ పెట్టడం ఆరంభించాయి. కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాయి.

గతంలో సుప్రింకోర్టు ఎన్నికల కోడ్ కు సంబందించి సుదీర్ఘంగా కొనసాగడం సరికాదని, ఎన్నికలకు నాలుగువారాల ముందు పెట్టుకుంటే సరిపోతుందని నిమ్మగడ్డ కమిషనర్ గా ఉన్నప్పుడు వ్యాఖ్యానించింది. ఈ పాయింట్ ఆధారంగా విపక్షాలు నాలుగువారాలు కోడ్ అమలు చేశాకే ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లాయి.

నిజానికి అంతకుముందు నుంచి ఎన్నికల కోడ్ ఉంది. కేవలం మధ్యలో ఒక వారం రోజులు మాత్రం కోడ్ ఎత్తివేశారు. నిమ్మగడ్డ, టిడిపి కలిసి ఈ కుట్ర చేశారన్నది వైసిపి అభియోగంగా ఉంది. ఎన్నికల కోడ్ పాయింట్ పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కమిషన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఎన్నికలను ఆపుచేయాలని ఆదేశించింది.

అంతకుముందు ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని పేర్కొన్న న్యాయ వ్యవస్థ, ఈసారి మాత్రం ఎన్నికలనే ఆపేసింది. దానిపై ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశాయి. డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కౌంటింగ్ మాత్రం సింగిల్ బెంచ్ లో నిర్ణయించుకోవాలని తీర్పు ఇచ్చింది. దాంతో ఎన్నికలు జరిగి ,ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. ఈ తరుణంలో మళ్లీ సింగిల్ బెంచ్ ఏకంగా ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడే పలు ప్రశ్నలు అనండి..సందేహాలు అనండి ప్రజలకు వస్తున్నాయి.

గతంలో నిమ్మగడ్డ కూడా నెల రోజుల నిబంధనను పాటించలేదు. మరి అప్పుడు అవసరం లేని కోడ్ ఇప్పుడే కావాలని ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేశాయి. ఒక వైపు ఎన్నికలను బహిష్కరించామని చెప్పిన టిడిపి, కోడ్ అంటూ కోర్టుకు ఎందుకు వెళ్లింది. అలాగే బిజెపి, జనసేనలు కూడా ఎన్నికల రద్దు కోరుతూ పిటిషన్ లు వేశాయి.

హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోడ్ అమలు చేస్తున్నట్లు ఇక్కడి ఎన్నికల కమిషనర్ ప్రకటించినా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాని ఎపిలో మాత్రం ప్రతి అంశాన్ని విపక్షాలు ఎందుకు వివాదాస్పదం చేస్తూ హైకోర్టుకు పదే,పదే వెళుతున్నాయో అర్ధం కాదు. 

మరోవైపు డివిజన్ బెంచ్ ఎందుకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? సుప్రింకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు నెలరోజుల కోడ్ సూచిస్తున్నాయని భావిస్తే, కచ్చితంగా పాటించాలని ఉంటే కనుక డివిజన్ బెంచే ఎన్నికలను ఆపి ఉంటే వందల కోట్ల రూపాయల వ్యయం, ఎంతో ప్రయాస ఉండేవి కావు కదా? లేదా కౌటింగ్ కు సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదు కదా?మళ్లీ సింగిల్ బెంచ్ జడ్జి వద్దకు ఎందుకు వెళ్లమన్నారు?

ఒకసారి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకగా సింగిల్ బెంచ్ ఎన్నికల రద్దు తీర్పు ఇవ్వవచ్చా? అంతేకాక అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ ఎందుకు ఎన్నికలను పూర్తి చేయలేదని, అందులో ఉన్న కుట్ర ఏమిటని ఏ కోర్టు ఎందుకు ప్రశ్నించలేదో తెలియదు. గతంలో నిమ్మగడ్డ నెల రోజుల కోడ్ అనుసరించకపోయినా ఎందుకు తప్పు పట్టలేదు. 

కాని కొత్త కమిషనర్ నీలం సహానిపై అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయవలసిన అవసరం న్యాయస్థానానికి ఉందా? ఇలా పలు సందేహాలు ఈ అంశంలో వస్తున్నాయి. అయితే గౌరవ జడ్జిలు తమ, తమ సాంకేతిక కారణాలతో తీర్పులు ఇచ్చి ఉండవచ్చు. వారికి ఉద్దేశాలు ఆపాదించజాలం. అయినప్పటికీ వారి తీర్పుల లోతుపాతులను చర్చించుకోవడం తప్పుకాదు. విపక్షాలు ఈ తీర్పును సమర్దిస్తే, అదికార వైసిపి మాత్రం ఇది దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది.

ఇక రఘురామరాజు కేసు విషయానికి వద్దాం.ఆయనను అరెస్టు చేసిన వెంటనే ఆయన వాయువేగంతో హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం, దానిపై హైకోర్టు విచారించి బెయిల్ నిరాకరించడం, ఆ తర్వాత సుప్రింకోర్టుకు కూడా అంతే వేగంగా వెళ్లడం, దానిని అక్కడ కూడా విచారించడం, షరతులతో బెయిల్ ఇవ్వడం ఆసక్తికరమైన అంశమే. ఒక సామాన్యుడికి కూడా ఇంత వేగంగా వ్యవస్థ స్పందిస్తున్నదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. బెయిల్ కోసం వేల పిటిషన్ లు పెండింగులో ఉన్నాయని ఎపి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే చెప్పడమే దీనికి ఉదాహరణ.

అలాగే అరెస్టు అయిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తనను పోలీసులు కొట్టినట్లు చెప్పని రఘురాజు హైకోర్టులో బెయిల్ రాలేదని తెలిసిన తర్వాత, మెజిస్ట్రేట్ కోర్టులో తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. తన కాళ్లు కూడా చూపించారు. కాని ఆయన అంతకుముందు కారులో దిగి ఏమి ఇబ్బంది లేకుండా నడవగలిగారు.చిత్రంగా ఆ కోర్టు వారు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసిన తర్వాత రమేష్ ఆస్పత్రికి తరలించి కూడా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. 

అది చట్ట ప్రకారం చెల్దదన్నది న్యాయ నిపుణుల వాదనగా ఉంది. ఈలోగా ఎపి హైకోర్టువారు ఈ అంశాన్ని స్వీకరించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి లో మెడికల్ బోర్డువారు పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈలోగా కేసు సుప్రింకోర్టుకు చేరింది. అక్కడ రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు కొట్టారన్న ఆరోపణను సుప్రింకోర్టు సీరియస్ గా తీసుకుంది. వారు సికింద్రాబాద్ ఆర్మి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి ఎమ్.పిగారు తన సొంతకారులో వెళ్లడం విశేషం. మధ్యలో ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.

ఆర్మి నివేదికలో గుంటూరు వైద్యుల నివేదికలోని అంశాలతో పాటు కాలివేలుకు గాయం ఉన్నట్లు రాశారు. అయితే అది ఎలా ఏర్పడిందన్నది తెలపలేదు. రాజు తరపు న్యాయవాది సిఐడి వారే కొట్టారని వాదించగా, ప్రభుత్వ న్యాయవాది ఎమ్.పినే ఆ గాయం చేసుకుని ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరులో తీసిన ఎక్స్ రే లో అలాంటివి ఏమీ లేనప్పుడు సికింద్రబాదులో తీసిన ఎక్స్ రేలో ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మొత్తం మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టువారు కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టడం ఆసక్తికరంగానే ఉంది. అంటే ఇక్కడ ఎవరు తప్పు చేశారు. సిఐడినా?ఎమ్.పి రాజుగారా?ఈ విషయాన్ని తేల్చడానికి సుప్రింకోర్టు ఎందుకు ఆసక్తి కనబరచలేదో తెలియదు.

బెయిల్ విషయానికి వచ్చేసరికి ఎమ్.పి ఆరోగ్య పరిస్తితిని గమనంలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. అయితే ఆయన మీడియాతో మాట్లాడరాదని, సిఐడి విచారణకు హాజరు కావాలని తదితర కండిషన్లు పెట్టింది. ఇక్కడ వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే రాజు మీద ఏ సెక్షన్ లు అయితే పోలీసులు పెట్టారో, అవే సెక్షన్ లతో కేసులలో ఉన్న మరికొందరికి ఇదే సుప్రింకోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదట. 

పైగా అసలు బెయిల్ వంటి విషయాలు ముందుగా కింది కోర్టులో తేల్చుకోవాలని గతంలో సుప్రింకోర్టు ఆదేశాలు ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సుప్రింకోర్టు రాజుగారిని మాత్రం ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. అయితే రాజుకు కండిషన్లు పెట్టిన తీరు మాత్రం ప్రభుత్వానికి కొంత ఉపశమనమే అని చెప్పాలి. బెయిల్ ఇచ్చినా, సిఐడి కేసును కోర్టు తోసిపుచ్చలేదన్నమాట.ఇంతవరకు సుప్రింకోర్టును అభినందించవచ్చు.

అంటే రఘురాజు , ఆ తర్వాత రెండు టివీ చానళ్లు భవిష్యత్తులో మళ్లీ ఏవైనా తీర్పులు వస్తే తప్ప ఈ కేసును ఎదుర్కోవలసి ఉంటుందని భావించవచ్చు.ఈలోగా హైకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. చిత్రంగా కింది కోర్టులో రమేష్ ఆస్పత్రికి రాజును పంపించాలని ఆదేశిస్తే ఎందుకు పంపలేదని డివిజన్ బెంచ్ ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడితో ఆగకుండా సిఐడి ఉన్నతాధికారికి ,మరికొందరికి కోర్టు దిక్కార నోటీసులు ఇస్తున్నామని చెప్పడం అందరిని విస్మయపరిచింది. ఒక పక్క సుప్రింకోర్టు రఘురాజును ఆర్మి ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు వారు ఇలాంటి ఆదేశాలు ఇవ్వవచ్చా అన్న సందేహం ఏర్పడింది.

ఏది ఏమైనా న్యాయ వ్యవస్థ ఇలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది.ఎందుకంటే న్యాయం చేయడమే కాదు..న్యాయం చేసినట్లు కనిపించాలన్నది ఒక సూత్రం. మరి మన దేశంలో న్యాయ వ్యవస్థ అలాగే ఉందా?

కొమ్మినేని శ్రీనివాసరావు