మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) తొలి ఫొటోని పంపింది. మార్స్ మీదకి ఇస్రో ‘మామ్’ని విజయవంతంగా ప్రయోగించడం.. అది నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం తెల్సిన విషయాలే. తొలి ప్రయత్నంలో మార్స్ ఆర్బిట్లో ప్రవేశించడం ద్వారా ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించిన మామ్, మార్స్ ఆర్బిట్లోకి వెళ్ళిన తొలి ఆసియా దేశపు ఉపగ్రహంగానూ రికార్డులకెక్కింది.
ఇక, మార్స్ని ఫొటో తీసిన మామ్.. ఆ ఫొటోల్ని భూమికి పంపింది. ఈ ఫొటోల్లో ఒకదాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా అందించారు ఇస్రో అధికారులు. మామ్ ప్రయోగం చివరి దశ విజయవంతమవడాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, శాస్త్రవేత్తలతో ఆనందాన్ని పంచుకున్న నరేంద్ర మోడీ, ‘మామ్’ నుంచి వచ్చిన బహుమతిని చూసి మరింత మురిసిపోయారు.
ఇక, మార్స్పై పరిస్థితుల్ని ‘మామ్’ పంపే ఫొటోల ద్వారా ఇస్రో అధ్యయనం చేయనుంది. ఇప్పటికే మార్స్పై పలు రోవర్లు భూమ్మీదనుంచి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నా, ‘మామ్’ సేకరించే విషయాలు అత్యంత ప్రత్యేకమైనవని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మామ్’ పంపిన ఫొటోల్ని ఇస్రో సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చింది. క్షణాల్లో లక్షల సంఖ్యలో ఈ ఫొటోలు షేర్ అవుతున్నాయి.