బాలాపూర్‌ లడ్డూ.. ఈసారి 9.5 లక్షలు

హైద్రాబాద్‌ గణేష్‌ నిమజ్జనోత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. గత ఏడాది 9 లక్షల 26 వేల రూపాయలకు తీగల కృష్ణారెడ్డి లడ్డూని సొంతం చేసుకోగా, ఈసారి ఇంకో…

హైద్రాబాద్‌ గణేష్‌ నిమజ్జనోత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. గత ఏడాది 9 లక్షల 26 వేల రూపాయలకు తీగల కృష్ణారెడ్డి లడ్డూని సొంతం చేసుకోగా, ఈసారి ఇంకో ఇరవై నాలుగు వేల రూపాయలు అధికంగా.. అంటే తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకు సింగిరెడ్డి జయేందర్‌రెడ్డి లడ్డూని వేలం పాటలో సొంతం చేసుకున్నారు.

గత ఏడాది లడ్డూని సొంతం చేసుకోవడం వల్లే తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారనే వాదన ఒకటుంది. లడ్డూని ఎవరు సొంతం చేసుకుంటే వారికి అదృష్టం కలిసొస్తుందన్న నమ్మకం బాలాపూర్‌ గణేష్‌ భక్తుల్లో వుంది. అందుకే, ఎంత ఖర్చుచేసైనా లడ్డూని సొంతం చేసుకోవడానికి పోటీ పడ్తుంటారు. ఈ ఏడాది కూడా తీగల కృష్ణారెడ్డి వేలంలో పాల్గొన్నా, లడ్డూ మాత్రం సింగిరెడ్డి జయేందర్‌రెడ్డికి దక్కింది.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన బాలాపూర్‌ లడ్డూ వేలంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 20 మందికి పైగా ఈ వేలం కార్యక్రమం కోసం ‘రిజిస్టర్‌’ చేసుకోవడం గమనార్హం. చిన్నా చితకా గణేష్‌ మండపాల వద్ద కూడా లడ్డూ ధర వేలు దాటి, లక్షల్లో పలుకుతోంది.