Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: టిడిపి మెడకు బలవంతపు తాళి

ఎమ్బీయస్‍: టిడిపి మెడకు బలవంతపు తాళి

‘‘జీవన తరంగాలు’’ సినిమాలో శోభన్‌బాబు ఒక డబ్బున్న లాయరు. సవతి తమ్ముడు చంద్రమోహన్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అతను ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి వాణిశ్రీతో వెళ్లి తరచుగా కబుర్లు చెపుతూండడం యితని దృష్టికి వచ్చి నిలదీస్తాడు. ‘ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందా మనుకుంటున్నాను.’ అంటాడు చంద్రమోహన్. తమ్ముడికి నచ్చచెప్పి చూసి విఫలం కావడంతో శోభన్‌బాబు ఓ రోజు వాణిశ్రీని కిడ్నాప్ చేసి, బలవంతంగా తాళి కట్టేసి, పెళ్లి జరిగినట్లు ఫోటోలు తీయించి, ‘మా తమ్ముడి జోలికి మళ్లీ వచ్చావంటే, నీకు ఆల్‌రెడీ పెళ్లయిపోయిందని వీటితో రుజువు చేసి, పెళ్లి జరగకుండా చేస్తాను. మా తమ్ముణ్ని వదిలేసే మాటైతే యీ ఉత్తుత్తి పెళ్లి విషయం బయట ఎక్కడా పొక్కదు.’ అని హెచ్చరిస్తాడు. ఇక్కడ ట్విస్టేమేమిటంటే చంద్రమోహన్‌ను పెళ్లి చేసుకునే ఉద్దేశం వాణిశ్రీకి ఏ కోశాన లేదు. అతన్ని తమ్ముడిగా చూస్తుంది. ఇది తెలియక చంద్రమోహన్ అన్నతో ఆమెను పెళ్లాడతానని చెప్పడంతో వస్తుంది అనర్థం.

కమ్యూనిస్టులు తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటామని తమంతట తామే ప్రకటించడంతో నాకిది గుర్తుకు వచ్చింది. ఏ పార్టీ ఐనా పొత్తు పెట్టుకునే మందు పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలి. అందరూ కలిసి తీర్మానం చేయాలి. అప్పుడు ప్రకటించాలి. పవన్ కళ్యాణ్ అలా చేయలేదు కదా అంటే, ఆయన పార్టీ అధ్యక్షుడు, కర్తా, కర్మా, క్రియా అన్నీ. ఆయనే పార్టీ, పార్టీయే ఆయన. మరో నాయకుడూ లేడు. ఎదురాడే కార్యకర్తా లేడు. అయినా లాంఛనప్రాయంగానైనా పార్టీ సమావేశంలో ప్ర్తస్తావించకుండా ప్రకటన చేయడం వింతగానే ఉందని వ్యాఖ్యలు వచ్చాయి. అలాటప్పుడు కమ్యూనిస్టుల నేమనాలి? జాతీయ పార్టీ హోదా ఉందో, ఊడిందో తెలియదు కానీ, పలు రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కదా. టీవీ చర్చల్లో కూర్చుని అక్కణ్నుంచి ప్రకటనలు యిచ్చేయడమేనా?

చంద్రబాబు అరెస్టు తర్వాత ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో చర్చల్లో కూర్చుని సిపిఐ రామకృష్ణ ‘మేం టిడిపితో పొత్తు పెట్టుకుంటాం’ అని ప్రకటించేశారు. అదే ప్యానెల్‌లో ఉన్న సిపిఎం గఫూర్ ‘బిజెపితో తెంచుకుంటే మేమూ టిడిపితో పొత్తు పెట్టుకుంటాం’ అని ప్రకటించారు. ఆయన షరతు పెట్టాడు కానీ, రామకృష్ణ గారు అలాటి షరతులేమీ లేకుండా ప్రకటించేశారు. పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తారన్న పేరున్న కమ్యూనిస్టు నాయకులు బాబు విషయానికి వచ్చేసరికి ముందూవెనుకా చూడకుండా యిలా ప్రకటించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకంటె చిత్రం ఏమిటంటే ఆ యా పార్టీల జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వం వీరి ప్రవర్తనను ఖండించకపోవడం! ఎందుకంటే వాళ్లకు నక్కాశ. ఆ రూపేణా ఐనా ఎన్నికల రంగంలో ఉంటామేమోనని.

రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి రెండూ బిజెపికి వంత పాడుతున్నాయి. కేంద్ర బిజెపి ఏం చేసినా సమర్థిస్తూనే ఉన్నాయి. 6% ఓటింగు తెచ్చుకున్న జనసేన. 2019లో తమతో పొత్తు పెట్టుకుని, ఫలితాల తర్వాత బయటకు తగిలేసి, బిజెపితో పొత్తులో ఉన్నానంటున్నాడు. అంతేకాదు, వాళ్లకు టిడిపితో పొత్తు కలిపిస్తానంటున్నాడు. ఇక మిగిలినది దిక్కూమొక్కూ లేని కాంగ్రెసు ఒకటే. దానితో హస్తం కలిపినా, కలపక పోయినా ఒకటే. ఈసారి ఎన్నికలలో తాము నిలబడడానికి నాలుగు స్థానాలు కూడా కనబడని స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనుక టిడిపి బిజెపితో తెంపుకుంటే, వెంటనే తాము, టిడిపి, దానితో పాటు జనసేన, కాంగ్రెసు కలిసి, ఐదు పార్టీల కూటమిగా ప్రొజెక్టు చేసుకుంటూ బరిలో నిలబడదామని కమ్యూనిస్టుల ఆశ.

ఇన్నాళ్లూ ఆ ఆశ మిణుకుమిణుకు మంటూనే ఉంది. ఎందుకంటే బాబు బిజెపి వైపే చూస్తున్నారు. అది చాలా పొరపాటు అని సిపిఐ నారాయణ బహిరంగంగా హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోలేదు. బాబు ఆరెస్టు వెనక బిజెపి ఆశీస్సులున్నాయని అందరూ అనుమానిస్తున్న వేళ, యిప్పటికైనా టిడిపి బిజెపిపై ఆశలు తుంచుకుంటుందని ఆశపడ్డారు కమ్యూనిస్టులు. కానీ అలాటి ప్రకటన ఏదీ టిడిపి నుంచి రాలేదు. బిజెపికి హస్తం దీనిలో లేదని లోకేశ్ సర్టిఫికెట్టు కూడా యిచ్చారు. ఇక లాభం లేదని కమ్యూనిస్టులు శోభన్‌బాబు తరహాలో టిడిపి మెడలో బలవంతపు తాళి కట్టేశారు. ఇన్నాళ్లూ ఔననకుండా, కాదనకుండా కాలక్షేపం చేస్తున్న బిజెపి దీనితో ‘కమ్యూనిస్టులతో కలిశావా? అయితే నీ మొహం చూడను’ అని హుంకరిస్తుందని, టిడిపిని ఆవలకు నెట్టేస్తుందని యిక గతి లేక టిడిపి తమతో కూటమి కడుతుందని వాళ్ల లెక్క.

వాణిశ్రీ మనసులో ఏముందో తెలుసుకోకుండా శోభన్‌బాబు బలవంతంగా తాళి కట్టేసినట్లే, టిడిపి మనసులో ఏముందో తెలుసుకోకుండా, పట్టించుకోకుండా కమ్యూనిస్టులు దాని మెడలో తాళి కట్టేశారు. సినిమాలో వాణిశ్రీ ఆ పెళ్లిని ఆమోదించదు. ఇక్కడ టిడిపి కూడా కమ్యూనిస్టుల యీ ఆఫర్‌ను పట్టించుకోలేదు. కష్టకాలంలో మాకు అండగా నిలుస్తానన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ, పొత్తు ఉంటుంది, సీట్ల పంపిణీ విషయం సమయం వచ్చినపుడు చర్చిస్తాం లాటి ప్రకటన చేసి ఉండాల్సింది కానీ చేయలేదు. దాని అనుకూల మీడియా కూడా కమ్యూనిస్టుల ఆఫర్‌కు పెద్దగా కవరేజి యివ్వలేదు. ‘సిపిఐ ప్రతిపాదనపై బాబు నిర్ణయం తీసుకుంటారు’ అని లోకేశ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి చిన్న కామెంటు రాసిందంతే! వైసిపికి వ్యతిరేకంగా బిజెపితో సహా ఎవరు కలిసి వచ్చినా స్వీకరిస్తాం అంటున్న లోకేశ్, యీ ఆఫర్‌కు యింకా బాగా స్పందించి ఉండాల్సింది. అదేమీ చేయలేదు.

బాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో కూడా కమ్యూనిస్టులను కలుపుకునే ప్రయత్నం చేయడం లేదు. సెప్టెంబరు 30న నంద్యాలలో జరిగిన టిడిపి సమావేశంలో కూడా జనసేనతో కలిసి సంయుక్త కార్యాచరణ అన్నారు తప్ప కమ్యూనిస్టులను కూడా కలుపుకుంటాం అనలేదు. టిడిపి అంతరంగం తెలుసుకోకుండా బలవంతంగా తాళి కట్టేయడం వలన జరిగిన పరాభవం యిది. సినిమాలో శోభన్‌బాబుకి వాణిశ్రీ యిష్టాయిష్టాలు తెలియకపోయినా, కనీసం చంద్రమోహన్ అభిప్రాయమేమిటో తెలుసు. ఇక్కడ కమ్యూనిస్టులకు టిడిపి మనసు కాదు కదా, బిజెపి అంతరంగం కూడా ఏమిటో తెలియదు. కమ్యూనిస్టులకే కాదు, తక్కిన ఏ పార్టీకి బిజెపి ఉద్దేశాలేమిటో అర్థం కావటం లేదు. తక్కిన పార్టీల మాట ఒదిలేయండి, రాష్ట్ర బిజెపికైనా కేంద్ర బిజెపి మనోగతం తెలుస్తోందని నేను అనుకోవటం లేదు, ముఖ్యంగా జనసేన విషయంలో!

కమ్యూనిస్టులైతే యీ రోజు ఎగబడ్డారు కానీ, పవన్ ఎప్పణ్నుంచో టిడిపితో పొత్తు గురించి మాట్లాడుతున్నారు. మోదీ, అమిత్‌లతో తనకున్న దోస్తీని ఉపయోగించి, బిజెపిని కూడా ఒప్పించి 2014 నాటి కూటమిని పునరుద్ధరిస్తానని అంటూ వచ్చారు. దానికి బిజెపి అధిష్టానం ఔననలేదు, కాదనలేదు. సరైన సమయం వచ్చినపుడు నిర్ణయం తీసుకుంటుంది అని రాష్ట్ర బిజెపి నాయకులు ఓ రెండు సూక్తులు వల్లించి కిమ్మనకుండా కూర్చున్నారు. జనసేన-బిజెపి పొత్తులో ఉన్నాయని పైకి అనడమే కానీ ఆచరణలో కలిసి ఏ కార్యక్రమమూ చేపట్టరు. బిజెపి నాయకులు రాష్ట్రానికి వచ్చినపుడు జనసేనతో వేదిక పంచుకోరు. ఈ మధ్య దిల్లీలో ఎన్‌డిఏ సమావేశం అంటూ అందర్నీ పోగేసినప్పుడు జనసేనను కూడా పిలిచారు కాబట్టి, జనసేన ఎన్‌డిఏలో ఉన్నానని చెప్పుకోగలుగుతోంది.

తనకు అంత ప్రాధాన్యత దక్కినా, వాళ్లతో ఒక్క ముక్క చెప్పకుండా పవన్ రాజమండ్రి జైలు బయట ఏకపక్షంగా టిడిపితో పొత్తు ప్రకటించేశారు. మరి ఆ చర్యకు బిజెపి అధిష్టానానికి కోపం వచ్చిందా? అది బయటపడలేదు. కానీ కోపం వస్తుందని, ఆ కోపం తమపై ప్రసరిస్తుందని టిడిపి భయపడుతోంది. అందుకే ఓ పక్క బిజెపితో సంసారం చేస్తూనే మరో పక్క శోభన్‌బాబు తరహాలో తమ మెడలో బలవంతపు తాళి కట్టిన పవన్ ప్రవర్తనను ఆహ్వానించలేక పోతోంది. జనసేనతో పొత్తు అవసరమే, కానీ అది బిజెపికి కోపం తెప్పించని రీతిలో జరగాలని టిడిపి ఆశ. లేకపోతే ‘నా భాగస్వామిని ఊరించి నీ పక్కకు లాక్కుంటావా? నీ పని చెప్తా నుండు.’ అని పగబడుతుందోమో నన్న జంకు. అసలే కష్టకాలం. జగన్‌కు ముకుతాడు వేయగలిగేది కేంద్ర బిజెపి ఒక్కటే. రాష్ట్ర స్థాయి కేసులు మాత్రమే అయితే జగన్ రాజకీయ కక్షతో చేస్తున్నాడని వాదిస్తూ పోవచ్చు. కొన్ని కేసుల్లో జాతీయ విచారణ సంస్థలు కూడా యిన్వాల్వ్ అయి ఉన్నాయి. వాటికి పగ్గాలు వేయవలసినది కేంద్రం మాత్రమే. వేయకపోతే డిఫెన్స్ లేకుండా పోతుంది. ప్రజల్లో అనుమానాలు బలపడే ప్రమాదం ఉంది.

ఈ భయాలతోనే కాబోలు, పవన్ పొత్తు ప్రకటన చేయగానే పక్కనున్న లోకేశ్, బాలకృష్ణ హర్షించలేదు. బిత్తరి చూపులతో సరిపెట్టారు. లోపల పవన్ బాబుతో 20 సీట్లకు బేరమాడుకుని వచ్చారని, అందుకే హుషారుగా పొత్తు ప్రకటించారని కొందరంటున్నారు. అదే నిజమైతే వీళ్లూ గొంతు కలపాలి కదా! బిజెపి ఏమనుకుంటుందోనన్న భయంతో, అది పవన్ సొంత నిర్ణయం తప్ప, సంయుక్త నిర్ణయం కాదని చెప్పదలచుకుని మిన్నకున్నారా? పోనీ తర్వాతైనా ఆ పొత్తు గురించి మాట్లాడాలి కదా. పవన్ మాత్రమే పొత్తు గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నారు. టిడిపి పొత్తు గురించి యిప్పటిదాకా కన్‌ఫమ్ చేయటం లేదు. సీట్ల సంఖ్య యిప్పుడే చెప్తారని ఆశించడం పొరపాటు. ఎన్నికలు దూరంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో బలాబలాలు బేరీజు వేసుకుని కానీ, ఆ సంఖ్య బయటపెట్టరు. కానీ కృష్ణార్జునుల్లా మేం చేతులు కలిపాం, కాసుకో జగన్ అని టిడిపి వైపు నుంచి ఒక్క ప్రకటనా రాలేదు.

అరెస్టుకు నిరసనగా చేసే ప్రదర్శనల్లో జనసేనతో చేతులు కలుపుతాం అని తీర్మానం చేసిన నంద్యాల సమావేశంలో ఉన్నవారందరూ టిడిపి వారే తప్ప జనసేన వాళ్లు ఉన్నట్లు లేరు. ఆ రోజున జరిగిన తప్పెట్ల మోతలో జనసేన కలిసి రాలేదు. దేశవిదేశాల్లో, పరరాష్ట్రాలలో చేసే ప్రదర్శనల్లో యీ సంయుక్తం కనబడటం లేదు. అక్కడంతా పసుపుమయమే. బాబు మళ్లీ సిఎం కావాలి అనే నినాదాలే. పవన్‌కు అనుకూల నినాదాలు వినరావటం లేదు. ఆంధ్రలో జరుగుతున్న చెదురుమదురు ప్రదర్శనల్లో కూడా టిడిపి వారి షోలలో జనసేన నాయకులెవరూ పాల్గొనటం లేదు. కొందరు కార్యకర్తలుంటున్నారేమో తెలియదు కానీ జండాలూ పెద్దగా కనబడటం లేదు. ఇక వారాహి యాత్రలో మాత్రం కొన్ని పచ్చ జండాలు కనబడుతున్నాయి. చూడబోతే యిదేదో ఒన్‌వే ట్రాఫిక్‌లా కనబడుతోంది.

ఇది జనసేనలో కొందరికి నచ్చటం లేదు. జగన్‌పై ఎప్పణ్నుంచో అవినీతి మచ్చ పడింది, ప్రస్తుతం బాబుపై మచ్చ పడింది. రుజువులు దొరక్కపోతే మచ్చ మిగలదు. కానీ ప్రస్తుత సమయంలో ‘వాళ్లిద్దరి కంటె భిన్నంగా అవినీతి మచ్చలేని వ్యక్తిత్వంతో నేను వస్తున్నాను, నాకో ఛాన్సిచ్చి చూడండి’ అనే నినాదంతో చెలరేగి పోవాల్సిన పవన్ టిడిపి నీడకు చేరి, వాళ్ల కంటె ఎక్కువగా హడావుడి చేయడమేమిటి? అని జనసైనికుల్లో కొందరి బాధ. తాము బేషరతుగా పొత్తు ప్రకటించినా, టిడిపి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, వీళ్లకు అరికాలి మంట నెత్తి కెక్కినట్లుంది. అందుకని కొందరు సోషల్ మీడియాలో టిడిపి వ్యతిరేక వ్యాఖ్యలు పెడితే నాగబాబు వాళ్లను హెచ్చరించారు. చివరకు ‘మోర్ లాయల్ దేన్ కింగ్’లా టిడిపి నాయకుల కంటె పవన్ ఎక్కువ విధేయంగా ఉన్నట్లు కనబడుతోంది.

‘పవన్ యిదంతా తెలివితక్కువగా చేయడం లేదు, బిజెపియే అతని చేత యీ నాటకం ఆడిస్తోంది’ అంటున్నారు కొందరు విశ్లేషకులు. బిజెపి టిడిపితో ఓ క్రూయల్ గేమ్ ఆడుతోంది. పైన చెప్పిన సినిమాలో శోభన్‌బాబు వాణిశ్రీకి తాళి కట్టకుండా, ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నా డనుకోండి, పోనీ నువ్వు చేసుకుంటావా అంటే ఔననకుండా, కాదనకుండా నానుస్తూ ఆమెకు పెళ్లి వయసు దాటి పోయేట్లా చేశాడనుకోండి, అప్పుడు దీనితో పోల్చవచ్చు. టిడిపితో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోము అని బాహాటంగా ప్రకటించేసి, టిడిపికి అనుకూలంగా మాట్లాడిన రాష్ట్ర బిజెపి నాయకులపై చర్యలు తీసుకుంటే, టిడిపికి కూడా బిజెపి వైఖరిపై క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు జనసేన, కాంగ్రెసు, లెఫ్ట్‌లతో కలిసి మహా కూటమో, మహాద్భుత కూటమో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగుతుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరితే, వాళ్లూ వచ్చి కాన్వాస్ చేసి పెడతారు.

కానీ బిజెపి అది జరగనివ్వటం లేదు. తమాషా ఏమిటంటే, పవన్ ఏకపక్షంగా తమతో సంప్రదించకుండా టిడిపితో పొత్తు ప్రకటించినా దాన్ని ఆమోదించినట్లు లేదా తిరస్కరించినట్లు బిజెపి ప్రకటించలేదు. ఇదేం బాగా లేదంటూ పవన్‌కు కబురంపినట్లూ లేదు. పవన్ తమ పేరు వాడుకుంటూ కూటమిలోకి బిజెపిని లాక్కుని వస్తా అని ప్రకటిస్తున్నా, ‘ఇప్పట్లో మాకా ఆలోచన ఏమీ లేదు’ అని ఖండించటమూ లేదు. వారాహి యాత్రలో కలిసి రానూ లేదు. అరెస్టుకి వ్యతిరేకంగా జరిగిన బంద్‌లో తను పాల్గొనలేదు, అలా అని జనసేనను వారించనూ లేదు. ఆంధ్ర ఎన్నికలకు టైముంది కదా అని ఊరుకున్నారు అనుకుంటే మరి తెలంగాణ మాటేమిటి? ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి కదా! ఒకప్పుడు తెరాసకు ప్రత్యామ్నాయం బిజెపి అనుకున్న పరిస్థితి నుంచి కర్ణాటక ఎన్నికల అనంతరం బిజెపి మూడో స్థానానికి వెళ్లిపోయింది. పోటీ చేసే అభ్యర్థులు కానరాక అల్లాడుతోంది.

ఇలాటప్పుడు ఈ బిజెపి-టిడిపి-జనసేన కూటమి ఏదో అక్కడా ఏర్పడి తెరాస, కాంగ్రెసులతో తలపడవచ్చు కదా అని టిడిపి అభిమానుల ఆశ. ఆ దిశగా బిజెపిని ప్రేరేపించాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నానా తంటాలు పడుతున్నారు. ‘చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్‌కు బిజెపి సహకరించిందనే భావన కారణంగానే తెలంగాణలో బిజెపి నానాటికీ బలహీనపడుతోంద’ని ఆయన అక్టోబరు 1 ‘కొత్త పలుకు’లో రాశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రమూలాల వారి ఓట్లన్నీ టిడిపివే అనే ధోరణిలో చాలా మంది విశ్లేషకులు మాట్లాడతారు. ఆంధ్రలోనే టిడిపి 40% ఓట్లు తెచ్చుకుంది. అది 2019లో. ఇప్పుడు 35కి దిగిందని కొన్ని సర్వేలు అంటున్నాయి. అబ్బే పెరిగిందని అనుకున్నా మహా అయితే 45. అదే నిష్పత్తి తెలంగాణలోనూ అప్లయి చేసి చూసినా యిక్కడ ప్రత్యామ్నాయంగా అధికార పార్టీ ఐన తెరాస ఉంది కదా. అది ఆంధ్రమూలాల వారిని ప్రత్యేకంగా యిబ్బంది పెట్టడం లేదు కదా. మరి వాళ్లకు తెరాస అంటే ఫిర్యాదు ఎందుకుంటుంది?

బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాదులో జరిగే ప్రదర్శనలు ఐటీ రంగానికి మాత్రమే పరిమితమయ్యాయే అనుకుంటూ వస్తే నిన్న జరిగిన ప్రదర్శనలు 8 కమ్మ సంఘాల ఆధ్వర్యంలో జరిగాయని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చివరకు యిదేదో కమ్మవారికి సంబంధించిన వ్యవహారమే అనుకునే విధంగా పరిణమిస్తే తెలంగాణలో టిడిపికి ఓట్లెందుకు పడతాయి? తెలంగాణలో కమ్మవారి శాతం ఎంత? వారిలో టిడిపి అభిమానులెందరు? అభిమానం, సానుభూతి ఉన్నా అది ఓటుగా మారే అవకాశం ఎంత? మారాలంటే పార్టీకి యిన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మాజీ టిడిపి వారందరూ తెరాసలో చేరి పదవులు అనుభవిస్తున్నారు. వాళ్లెందుకు పట్టించుకుంటారు? బాబు, లోకేశ్‌లు చాలా ఏళ్లగా తెలంగాణ వైపు తొంగి చూడక నిర్లక్ష్యం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ నియామక వేళ మాత్రం బాబు కాస్త హడావుడి చేశారు. తర్వాత గప్‌చుప్. ఇక్కడ పాదయాత్రలు లేవు, బస్సు యాత్రలు లేవు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకుని వచ్చిన రోజున వేరెవరూ దొరకనట్లుగా బాలకృష్ణను తెలంగాణ చూసుకోమని పంపించారు. ఆంధ్రలో పనికి రాకపోతే తెలంగాణకు పంపేయడమేనా?

తెలంగాణలో టిడిపి తరఫున టిక్కెట్టడిగే వాళ్లే లేరు. ఆ పార్టీకి ఓటేసేవారుంటే పరిస్థితి యిలా ఉండేదా? అయినా టిడిపిని కలుపుకోక పోతే 40 నియోజకవర్గాల్లో దెబ్బ తింటారు అని పత్రికలు, టీవీలు చెప్పేస్తున్నాయి. ఆ మాటలను బిజెపి విశ్వసించలేదని అర్థమౌతోంది. తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తానంటే సరేలే అని ఊరుకుంది తప్ప చలించలేదు. కాంగ్రెసు తర్వాతి స్థానానికి వెళ్లినా ఫర్వాలేదు కానీ టిడిపితో చేతులు కలిపే ప్రశ్నే లేదనుకుంటోంది. ఇటు జనసేన కూడా ఆంధ్రలో టిడిపి పొత్తు అంటూ తెలంగాణలో పొత్తు పెట్టుకోక పోవడమేమిటి? చిత్రంగా లేదూ! బాబు అభిమానులు తెలంగాణలో యిబ్బడిముబ్బడిగా ఉంటే, వాళ్లందరికీ బాబుపై సానుభూతి వర్షిస్తూ ఉంటే దాన్ని సొమ్ము చేసుకోవడానికి యిదే తరుణం కదా! దీని అర్థం, తెలంగాణలో టిడిపి బలం మీడియా సృష్టే అనుకుని ఏ పార్టీ టిడిపిని దగ్గరకు రానీయటం లేదు. వాటిలో బిజెపి కూడా ఒకటి.

ఇక ఆంధ్రకు వస్తే బిజెపి టిడిపిని ఎటర్నల్ వెయిటింగ్‌లో ఉంచుతోంది. దాంతో బాటు దాని బలాన్ని కొంతమేరకైనా హరించడానికి పవన్‌ను ఉపయోగిస్తోందని కొందరు విశ్లేషకుల అనుమానం. పవన్ బాబు చెప్పినట్లల్లా ఆడే కీలుబొమ్మ అనే యిన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. దానికి విరుద్ధంగా యీ సిద్ధాంతం పుట్టుకుని వచ్చింది. టిడిపి ప్రస్తుత దుస్థితిని (దీని గురించి ‘‘టిడిపి క్రైసిస్ మేనేజ్‌మెంట్’’ అనే వ్యాసంలో చర్చిస్తాను) ఆసరాగా తీసుకుని, జగన్‌ను ఎదిరించగల ‘ఒక్క మొగాడు’గా పవన్‌ను ప్రొజెక్టు చేసి, బాబును ఆ మేరకు తగ్గించే ప్రయత్నం చేస్తోందని వారి వాదన. బిజెపికి తెలియకుండా చిటుక్కుమనడానికి చీమకూడా భయపడే యీ రోజుల్లో బాబు ఆరెస్టు కావడం, నెల్లాళ్లపాటు జైల్లోనే ఉండడం, బిజెపి వ్యూహంలో భాగమని నమ్మేవాళ్లకు కొదవ లేదు. బాబు, లోకేశ్‌ల పాదయాత్రలు ఆగిపోయాయి. పవన్ వారాహి యాత్ర మళ్లీ మొదలైంది. టిడిపికి ఉన్నది అనుభవం, మాకున్నది పోరాటపటిమ అని పవన్ చాటుతున్నారు.

బాబు అరెస్టు తర్వాత జగన్‌పై రగులుతున్న వైసిపి వ్యతిరేకులకు పవన్ హీరోగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? జనసేన ఓటు బ్యాంకు పెరగనూ వచ్చు. అది టిడిపి ఓటు బ్యాంకు నుంచి బదిలీ అయి వచ్చేదైతే బాబుకి హాని జరిగినట్లే. అదే జరిగితే పవన్ బిజెపి కోవర్టు పాత్ర పోషించినట్లు తేలుతుంది. పవన్ కున్న రాజకీయావగాహనా స్థాయి బట్టి చూస్తే, యింతటి బాధ్యతను బిజెపి అతనికి అప్పగిస్తుందా అనేది సందేహమే. ఆయన తీవ్రావేశం, ఉన్మత్త వాక్ప్రవాహం మాత్రమే చూసినవాళ్లు, యిదంతా బిజెపి స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారని తెలిస్తే మాత్రం ‘దేర్ యీజ్ మెథడ్ యిన్ మ్యాడ్‌నెస్’ అనుకుంటారు. ఈ వ్యూహం థియరీ నిజమో కాదో కాలమే చెప్పాలి. వ్యూహరచనలో బిజెపి తక్కువది కాదు. 2014-18 మధ్య టిడిపితో పొత్తు బంధం నడుపుతూనే జగన్‌తో సఖ్యత మేన్‌టేన్ చేసిందనవచ్చు. లేకపోతే అతనిపై కేసులు కోల్డ్ స్టోరేజిలోకి వెళ్లేవి కావు. ఇప్పుడు ఆ గేమ్ రివర్స్ చేసి పైకి వైసిపితో సఖ్యంగా ఉంటూ, సరైన టైములో తమ పక్షానికి వస్తుందని టిడిపి ఆశ.

అప్పట్లో బిజెపి వైసిపితో సఖ్యత ఎందుకు పాటించింది? వైసిపి ఓటు బ్యాంకు చూసి! తమ కూటమికి అతనికి తేడా 2% లోపే కాబట్టి! ఇప్పుడు టిడిపి కూడా తన ఓటు శాతం పెంచుకుని వైసిపితో దాదాపు సరిసమానంగా ఉన్నట్లు స్థానిక ఎన్నికలలో, ఉప ఎన్నికలలో నిరూపించుకుని ఉంటే టిడిపి ఆశించినట్లు జరిగేది. కానీ సొంత బలం పెంచుకోకుండా పొత్తుల లెక్కల మీదే ఆధారపడడంతో వచ్చిందీ అవస్థ. బిజెపి వ్యూహాత్మక మౌనం పాటిస్తూ అందర్నీ గందరగోళానికి గురి చేస్తోంది. దాని వలన ఎక్కువగా నష్టపోతున్నది టిడిపియే. బిజెపి మనోభీష్టం స్పష్టంగా తెలియక పోవడం చేతనే టిడిపి మెడలో బలవంతపు తాళి కట్టడానికి తక్కినవారు ప్రయత్నిస్తున్నారు. దీనికి విరుగుడేమిటంటే టిడిపియే కుండ బద్దలు కొట్టి, ఫలానా తేదీలోగా ఏ విషయమూ చెప్పకపోతే మేము మా దారి చూసుకుంటామని బిజెపికి కబురు పెట్టడమే! అప్పటికీ బిజెపి పన్నెత్తి పలకకుండా ఉంటే ఏమైతే అది అయిందని ఇండియా కూటమిలో చేరి, వైసిపితో తలపడడమే మార్గం! అప్పుడు ఎవరితో ఉండాలో పవనే తేల్చుకుంటారు. టిడిపి సందిగ్ధంగా ఉన్న కొద్దీ క్యాడర్ జారుకునే, లేదా జావకారే ప్రమాదం ఎక్కువౌతుందని బాబు గ్రహించాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?