ఏపీఎన్ఆర్‌టీఎస్ బే ఏరియా కో స‌మ‌న్వయక‌ర్తగా సాగ‌ర్

న‌వ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస తెలుగు వారిని భాగస్వామ్యం చేసేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దిన ఏపీ ఎన్నార్టీఎస్ కి చైర్మన్ మరియు సీఈవో డాక్టర్ ర‌వి వేమూరు కొనసాగుతున్న…

న‌వ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస తెలుగు వారిని భాగస్వామ్యం చేసేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దిన ఏపీ ఎన్నార్టీఎస్ కి చైర్మన్ మరియు సీఈవో డాక్టర్ ర‌వి వేమూరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన ఏపీ ఎన్నార్టీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. డా. ర‌వి వేమూరు సార‌థ్యంలో ఎన్నార్టీఎస్ ఏర్పడి కొద్దికాలమే అయినప్పటికీ ఇప్పటికే సుమారు వంద సంస్థలను ఏపీకి రప్పించింది. అమరావతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఆయా సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఈ సంస్థల కారణంగా రాష్ట్రానికి రూ.500 కోట్ల పెట్టుబడులు త‌ద్వరా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగని ఓ పని ఎన్నార్టీఎస్ ఏర్పాటు వల్ల జరగనుంది. 

ఏపీఎన్నార్టీఎస్ లో పెట్టుబడుల విభాగం చూస్తున్న శేషు బాబు కానూరి ఎన్నారైల ద్వారా 300 కోట్లు సమీకరించి అమరావతిలో 27 అంతస్తుల భవనాన్ని 'ఎన్నార్టీ ఐకాన్' పేరుతో నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ సదుపాయాలతో నిర్మించే దీనిని తర్వాత వివిధ కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తారు. ఈ ఒక్క నిర్మాణమే ఐదువేల ఉన్నత ఉద్యోగాలను, 60 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదు. 

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో సంబంధాలు నిర్వహిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడంపై ఎన్నార్టీఎస్‌ దృష్టి పెట్టింది.  సుమారు 100 దేశాల్లో ఉన్న 40 లక్షల మంది తెలుగువారికి.. రాష్ట్రానికి మధ్య వారధిగా నిలుస్తోంది. ఏపీ ఎన్నార్టీఎస్‌ 1,00,00 మంది స‌భ్యులను ల‌క్ష్యంగా చేసుకోగా స్వల్ప కాలంలోనే 15,000 మంది చేర‌డం విశేషం. త‌న ల‌క్ష్యం వైపు ఎన్నార్టీఎస్ వేగంగా ముందుకు సాగుతోంది.

ఎన్నారైలకు మరింత దగ్గరవడంలో భాగంగా ఏపీ ఎన్నార్టీఎస్ ప్రపంచ‌వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారిని ప్రొవిజనల్ కో ఆర్డినేటర్లను నియమిస్తోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున అమెరికాలో తెలుగువారు నివ‌సిస్తున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియా & శాన్‌ఫ్రాన్సిస్కో లకు సాగ‌ర్ దొడ్డపనేనిని ఏపీఎన్నార్టీ ప్రొవిజనల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తూ ఏపీ ఎన్నార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏపీ ఎన్నార్టీఎస్ లో చేరిన ఎన్నారైలకు చేకూరే లాభాలు

టెంపుల్ టూరిజం, పీఐఓ/ఓసీఐ కార్డ్స్, పాన్ కార్డ్స్, క‌న్‌స‌ర్జ్ చార్జెస్‌, బ్యాంకింగ్ అసిస్టెన్స్‌, అన్ని ప్రభుత్వ వ్యవ‌హారాల‌కు సంబంధించిన స‌హాయ‌స‌హాకారాలు, విలువైన ప‌త్రాలు న‌ష్టపోయిన‌పుడు, యాక్సిడెంట్ మ‌ర‌ణాలు, స్థానిక ర‌వాణా, ప‌న్ను చెల్లింపుల‌పై స‌హాయ స‌హ‌కారాలు/ఫెరా, బేసిక్ లీగ‌ల్ అసిస్టెన్స్ వంటి అంశాల్లో ఎన్నార్టీఎస్ అండ‌గా ఉంటుంది. బిల్లు చెల్లింపులు, పేరేంట‌ల్ అసిస్టెన్స్‌, బుక్ టికెట్స్‌, స్థానిక దేవాల‌యాల సంద‌ర్శన‌లో మార్గద‌ర్శకం చూపించ‌డం వంటివి ఉంటాయి.

స్థానికంగా ల‌భించే కారును బాడుగ చేసుకొని దేవాల‌యాల సంద‌ర్శన‌, ఎయిర్‌పోర్ట్‌కు చేర‌డం వంటి విష‌యాల్లో అండ‌గా ఉంటుంది. పూర్తి ర‌వాణ స‌దుపాయాలు క‌ల్పించ‌డం, వీసా సంబంధ వ్యవ‌హారాల్లో స‌ల‌హాలు, డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువ‌ల్ చేసుకోవ‌డం, ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లించ‌డం వంటి ఎన్నో సౌల‌భ్యాలు పొంద‌వచ్చు.