బడ్జెట్ ఎఫెక్ట్: పెరిగిన ఐఫోన్ ధరలు

బడ్జెట్ ప్రభావం ప్రారంభమైంది. కేంద్రం ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు భారం ఐఫోన్లపై పడింది. తమ ఉత్పత్తుల ధరలు పెంచబోతున్నట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ మినహా మిగతా అన్ని మోడల్స్ ధరల్ని…

బడ్జెట్ ప్రభావం ప్రారంభమైంది. కేంద్రం ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు భారం ఐఫోన్లపై పడింది. తమ ఉత్పత్తుల ధరలు పెంచబోతున్నట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ మినహా మిగతా అన్ని మోడల్స్ ధరల్ని 3శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. నిన్నట్నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 

మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఐఫోన్ ధరల్ని సవరించింది ఆపిల్ సంస్థ. తాజా పెంపుతో ఇప్పటివరకు లక్షా 5వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్-ఎక్స్ మోడల్ ధర ఇప్పుడు మరింత పెరిగి, లక్షా 8వేల9వందల రూపాయలకు చేరింది. 

ఇక ఇండియాలో బాగా పాపులర్ అయిన ఐఫోన్-6ఎస్ రేటు 1350రూపాయల మేర పెరిగింది. ఈ మేరకు ఎస్ఈ మినహా మిగతా అన్ని మోడల్స్ సవరించిన ధరల్ని ఆపిల్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. భారత్ లోనే తయారీ అనే కాన్సెప్ట్ ను మరింత ప్రోత్సహించేందుకు ఇలా దిగుమతి సుంకాన్ని పెంచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పెంపు వరుసగా ఇది రెండోసారి. 

తాజా పెంపు నిర్ణయ ప్రభావం ఐఫోన్ పైనే ఎక్కువ. శాంసంగ్, జియోమీ, వివో లాంటి సంస్థల ఉత్పత్తులపై ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇవి తమ అసెంబ్లింగ్ యూనిట్లను భారత్ లోనే నెలకొల్పాయి. ఇక్కడ మొబైల్స్ ను తయారుచేయకపోయినా, విడిభాగాల్ని అనుసంధానించే ప్లాంట్స్ ను ఏర్పాటుచేశాయి. వాటిపై దిగుమతి సుంకం ప్రభావం లేదు.