శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ఢిల్లీలో మరో దారుణం

సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసు ఇంకా కొలిక్కిరాకముందే, ఇలాంటిదే మరో ఘటన ఢిల్లీలో జరిగింది. భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది ఓ భార్య. ఆ శరీర భాగాల్ని ఫ్రిడ్జ్ లో దాచి వివిధ…

సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసు ఇంకా కొలిక్కిరాకముందే, ఇలాంటిదే మరో ఘటన ఢిల్లీలో జరిగింది. భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది ఓ భార్య. ఆ శరీర భాగాల్ని ఫ్రిడ్జ్ లో దాచి వివిధ ప్రాంతాల్లో పడేసింది. ఈ హత్యలో ఆమెకు, కొడుకు కూడా సహకరించాడు. ప్రస్తుతం వీళ్లిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎలా బయటపడింది..

త్రిలోక్ పురి ప్రాంతంలో నివశిస్తున్నారు అంజన్ దాస్, పూనమ్ దంపతులు. వీళ్లకు దీపక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. భార్యాభర్త మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. దీంతో దీపక్ విడిగా ఉంటున్నాడు. ఇలాంటిదే ఓ గొడవ మరోసారి జరిగింది. దీంతో భర్తను, పూనమ్ హత్య చేసింది. అతడ్ని ముక్కలుగా నరికి, ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది.

తర్వాత ఈ విషయాన్ని కొడుకు దీపక్ కు చెప్పింది. ఇద్దరూ కలిసి శరీర భాగాల్ని వివిధ ప్రాంతాల్లో పడేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించారు. రామ్ లీలా మైదానం సమీపంలో ఉన్న పాండవ్ నగర్ లో ఇలానే శరీర భాగాల్ని పడేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు సీటీటీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అలా ఈ హత్య బయటపడింది.

చంపేసి కొన్ని నెలలు అయింది..

అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే..ఈ హత్య చాలా రోజుల కిందటే జరిగింది. దాదాపు 8 నెలల కిందటే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తల్లి-కొడుకు ఇద్దరూ కలిసి నెలల తరబడి ఇలా శరీర భాగాల్ని వివిధ ప్రాంతాల్లో విసిరేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. మృతుడు అంజన్ దాస్, దాదాపు 8-9 నెలలుగా కనిపించడం లేదంట.

ఇక ఈ అపార్ట్ మెంట్ లో ఐదేళ్లుగా వీళ్లు కాపురం ఉంటున్నారట. నిత్యం ఈ ఫ్లాట్ నుంచి గొడవలు వినిపించేవని, గడిచిన కొన్ని నెలలుగా అలాంటి గొడవలేం తమకు వినిపించలేదని, అదే టైమ్ లో అంజన్ దాస్ కూడా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు భార్య-కొడుకుని ప్రశ్నిస్తున్నారు.