కన్నతల్లి చంపేసింది.. మరో పరువు హత్య

కూతురుకు పెళ్లి చేసి తన చేతుల మీదుగా అత్తారింటికి పంపించాల్సిన ఆ తల్లి, అదే చేతులతో కన్నకూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. పరువు కోసం పాకులాడే ఆ మహాతల్లి, అల్లుడ్ని పొట్టన పెట్టుకుంది. సంచలనం…

కూతురుకు పెళ్లి చేసి తన చేతుల మీదుగా అత్తారింటికి పంపించాల్సిన ఆ తల్లి, అదే చేతులతో కన్నకూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. పరువు కోసం పాకులాడే ఆ మహాతల్లి, అల్లుడ్ని పొట్టన పెట్టుకుంది. సంచలనం రేపిన ఈ పరువు  హత్య అనంతపురం జిల్లాలో జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి, వీణ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే విషయం వీళ్లకు తెలుసు. అందుకే జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే మురళి, కియా కార్ల కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అటు వీణ కూడా గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం సంపాదించింది.

ఇద్దరూ ఉద్యోగాలు సంపాదించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూన్ లో పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలకు దూరంగా రాప్తాడుకు మకాం మార్చారు. అయితే తన కులం కాని వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకునేందనే కోపం, వీణ తల్లిలో అలానే ఉండిపోయింది. ఎలాగైనా అల్లుడ్ని హతమార్చి కూతుర్ని తన ఇంటికి తెచ్చుకోవాలనుకుంది.

ఎప్పట్లానే ఆఫీస్ కు వెళ్లేందుకు రాప్తాడు వై-జంక్షన్ వద్ద మురళి బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలోనే  కొంతమంది వ్యక్తులు ఆటోలో వచ్చి మురళిని ఎత్తుకెళ్లారు. భర్త ఇంటికి రాకపోవడంతో వీణ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అదే టైమ్ లో ఓ యువకుడు హత్యకు గురైనట్టు తెలుసుకున్న పోలీసులు ఆరాతీయగా అది మురళి  మృతదేహం అని తెలిసింది.

మురళిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తన తల్లికి అస్సలు ఇష్టం లేదని, ఆమెనే పథకం ప్రకారం మురళిని హత్య  చేయించి ఉంటుందని వీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీణ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.