ప్రేమించాడు.. పెళ్లాడాడు.. చంపేశాడు

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఓ నీచుడు. డంబెల్ తో కొట్టి చంపాడు. ఆ తర్వాత ముక్కలుగా కోసి డ్రమ్ముల్లో దాచాడు. జూబ్లిహిల్స్…

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఓ నీచుడు. డంబెల్ తో కొట్టి చంపాడు. ఆ తర్వాత ముక్కలుగా కోసి డ్రమ్ముల్లో దాచాడు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హఫీజ్ పేట్ కు చెందిన 21 ఏళ్ల సరోజ, ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనీల్ కుమార్ తో ఆమెకు పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లయిన 9 నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీనికి కారణం అనీల్ కుమార్.

అనీల్ కుమార్ కు అప్పటికే పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి, సరోజను పెళ్లాడాడు. ఇది తెలుసుకున్న సరోజ, అనీల్ ను నిలదీసింది. అదే ఆమె పాలిట శాపమైంది. గుట్టు తెలిసిపోవడంతో అనీల్ లోని రాక్షసుడు నిద్రలేచాడు. సరోజను డంబెల్ తో కొట్టి చంపేశాడు. తర్వాత ఆమెను ముక్కలుగా నరికి, ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకునే డ్రమ్ములో కుక్కాడు. తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

చనిపోవడానికి ముందు రోజు సరోజ, తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. విషయం మొత్తం చెప్పింది. జరిగిన గొడవ కూడా వివరించింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సరోజ ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి తాళం పగలగొట్టి చూడగా, డ్రమ్ముల్లో సరోజ శవం కనిపించింది. సరోజను తానే హత్య చేశానని అంగీకరించిన అనీల్, పోలీసులకు లొంగిపోయాడు.

ఇలా హత్య చేయడం అనీల్ కు ఇదే తొలిసారి కాదు. మొదటి భార్యను కూడా ఇలానే చంపేశాడు. అదనపు కట్నం తీసుకురాలేదనే కోపంతో మొదటి భార్యను హీటర్ తో కొట్టి చంపేశాడు. ఆ కేసులో రిమాండ్ లో ఉన్న ఇతడు, ఏడాది కిందటే బెయిల్ పై బయటకొచ్చాడు. ఆ వెంటనే సరోజను పెళ్లి చేసుకొని, మరో హత్య చేశాడు.