తెలంగాణలో కూడా మరో ‘పుష్ప’

మొన్నటిమొన్న ఆంధ్రప్రదేశ్ లో పుష్ప వ్యవహారం చూశాం. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి గొంతు కోసింది పుష్ప అనే అమ్మాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్…

మొన్నటిమొన్న ఆంధ్రప్రదేశ్ లో పుష్ప వ్యవహారం చూశాం. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి గొంతు కోసింది పుష్ప అనే అమ్మాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే తెలంగాణలో కూడా పునరావృతం అయింది. ఈ తెలంగాణ పుష్ప సంగతేంటో చూద్దాం.

హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన రాజు గత నెల 25న పెళ్లి చేసుకున్నాడు. తనకు సమీప ప్రాంతానికి చెందిన అర్చనను వివాహమాడాడు. ఇద్దరూ కలిసి కాపురం మొదలుపెట్టారు. అయితే పెళ్లయిన మరుసటి రోజు నుంచి అర్చన అదోలా ఉండడం గమనిస్తున్నాడు రాజు. భర్తపై అర్చన ఏనాడూ ప్రేమ చూపించలేదు.

పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో.. డ్రైవర్ డ్యూటీ చేసుకొని రాత్రి ఇంటికొచ్చిన రాజు తిని విశ్రమించాడు. అందరూ పడుకున్నప్పటికీ అర్చన మాత్రం నిద్రపోలేదు. మధ్యరాత్రి మెళకువ వచ్చిన రాజు, ఎందుకు నిద్రపోలేదని అర్చనను ప్రశ్నించారు. దానికామె విసురుగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలో తెల్లవారుజామున భర్తపై దాడి చేసింది అర్చన. బ్లేడుతో భర్త మెడపై కోసింది.

ఊహించని ఘటనతో రాజుకు నిద్ర మత్తు వదిలేసింది. మరోసారి తనపై దాడిచేయబోతున్న భార్య నుంచి తప్పించుకొని బయటకు పరుగులు తీశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఎంజీఎం హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకే భర్తపై అర్చన దాడిచేసినట్టు పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.