ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసిన కూతురు

ఆస్తి కోసం, ప్రియుడితో పెళ్లి కోసం.. కన్నతండ్రినే హత్య చేసింది ఓ కూతురు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. భార్యను కోల్పోయి బాధతో ఉన్న తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కూతురే, అతడ్ని…

ఆస్తి కోసం, ప్రియుడితో పెళ్లి కోసం.. కన్నతండ్రినే హత్య చేసింది ఓ కూతురు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. భార్యను కోల్పోయి బాధతో ఉన్న తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కూతురే, అతడ్ని హత్య చేసి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది.

మెహబూబాబాద్ మండలానికి చెందిన రాములుకు అర ఎకరం పొలం ఉంది. అందులోనే వ్యవసాయం చేసుకుంటూ, భార్య, కూతుర్ని పోషిస్తున్నాడు. అయితే కరోనాతో అతడి భార్య మరణించింది. దీంతో కూతురు తన చదువును మధ్యలోనే ఆపేసి ఇంట్లో తండ్రికి సహాయం చేస్తుండేది.

అయితే తండ్రికి ఉన్న మద్యం అలవాటు కూతుర్ని ఇబ్బంది పెట్టింది. దీనిపై తండ్రికూతురు ఇద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారు. తాగుడుకు బానిసైన తండ్రి, ఉన్న పొలం కూడా అమ్మేస్తాడేమోనని కూతురు అనుమానం. చివరికి విషయం పంచాయితీ వరకు వెళ్లింది. పంచాయితీ పెద్దలు తండ్రికూతురు మధ్య రాజీ కుదిర్చారు. కూతురుకు ధైర్యం కలిగించేందుకు పొలం పేపర్లను పంచాయితీ ఆఫీస్ లోనే పెట్టారు.

అయితే పంచాయితీ ముగిసినా, తండ్రి కూతురు మధ్య గొడవ తగ్గలేదు. దీంతో మొన్న రాత్రి తండ్రిపై కర్రతో దాడిచేసింది కూతురు. ఆ దెబ్బలకు రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయటకు లాగారు.

స్థానికంగా ఉన్న వెంకటేష్ అనే యువకుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది సదరు యువతి. తండ్రిని హత్య చేయడానికి ప్రియుడు కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ హత్య జరిగింది పొలం కోసం కాదంట. ఇప్పట్లో పెళ్లి వద్దని తండ్రి చెప్పడంతో, ఆగ్రహంతో ఈ ప్రేమజంట చేసిన దారుణం ఇది.  అలా కన్నకూతురు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు తండ్రి.