ఉత్తరప్రదేశ్ లో నిజజీవిత ‘దృశ్యం’

దృశ్యం సినిమాలో హత్య ఎపిసోడ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. శవాన్ని మాయం చేయడానికి హీరో చేసిన ప్రయత్నాల్ని కళ్లకుకట్టినట్టు చూపించారు. ఇప్పుడు అలాంటిదే సేమ్ సీన్ ఢిల్లీలో రిపీటైంది. భర్తను చంపేసిన భార్య, మృతదేహాన్ని…

దృశ్యం సినిమాలో హత్య ఎపిసోడ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. శవాన్ని మాయం చేయడానికి హీరో చేసిన ప్రయత్నాల్ని కళ్లకుకట్టినట్టు చూపించారు. ఇప్పుడు అలాంటిదే సేమ్ సీన్ ఢిల్లీలో రిపీటైంది. భర్తను చంపేసిన భార్య, మృతదేహాన్ని పూడ్చిపెట్టి దానిపై సెప్టిక్ ట్యాంక్ నిర్మించింది. అయినప్పటికీ దొరికిపోయింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన సతీష్-నీతు దంపతులు. వీళ్లకు ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. కుటుంబంతో కలిసి గ్రేటర్ నొయిడాకు వలస వచ్చిన సతీష్, అక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. హర్పాల్ అనే మేస్త్రికి ఆ పని అప్పగించాడు.

సతీష్ భార్య నీతు, హర్పాల్ దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను అడ్డు తప్పించి, హర్పాల్ తోనే ఉండిపోవాలని భాలించింది నీతు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ స్కెచ్ వేశారు.

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి సతీష్ కు పట్టించారు. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టి, దానిపై సెప్టిక్ ట్యాంక్ నిర్మించారు. దీంతో కథ సుఖాంతం అయిందనుకున్నారు.

కొన్ని రోజులుగా సతీష్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అతడి సోదరులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నీతును అనుమానించారు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపడింది. నీతూ-హర్పాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సెప్టిక్ ట్యాంక్ తవ్వి, దానికింద ఉన్న సతీష్ మృతదేహాన్ని గుర్తించారు.