రూ.600 కోట్ల సినిమాకు ప్రెస్ మీట్ ప్రచారం

దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్  తెలుగు రైట్స్ విలువ 76 కోట్ల రూపాయలు ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాను ఎలాంటి ప్రచారం లేకుండా తెలుగులో విడుదల చేస్తున్నారు. అవును.. 2.0…

దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ 
తెలుగు రైట్స్ విలువ 76 కోట్ల రూపాయలు

ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాను ఎలాంటి ప్రచారం లేకుండా తెలుగులో విడుదల చేస్తున్నారు. అవును.. 2.0 సినిమాకు సంబంధించి తెలుగులో ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లేవు. కేవలం ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.

2.0 తెలుగు వెర్షన్ కు సంబంధించి థియేట్రికల్ ట్రయిలర్ ను హైదరాబాద్ లో విడుదల చేస్తారంటూ హంగామా చేశారు ఈమధ్య. అది కుదరకపోవడంతో ఓ ఎక్స్ క్లూజివ్ సాంగ్ ను హైదరాబాద్ లో లాంచ్ చేస్తారంటూ ప్రచారం చేశారు. అది కూడా జరగలేదు.

ఇక రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ఉంటుందంటూ ఊదరగొట్టారు. ఆ ఈవెంట్ లో ఎక్స్ క్లూజివ్ గా త్రీడీలో కొన్ని క్లిప్పింగ్స్ రిలీజ్ చేస్తారంటూ మరో ప్రచారం. అది కూడా ఉత్తుత్తిదే అని తేలింది. ఇలా ఎన్నో గాసిప్పులు మధ్య, చివరాఖరికి ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకోవడానికి రెడీ అవుతోంది 2.0 యూనిట్.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ ప్రెస్ మీట్ కు వస్తారని చెబుతున్నారు. తెలుగులో 2.0 సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమం ఇదొక్కటే.

ఇలా సింగిల్ ప్రెస్ మీట్ తో 76 కోట్ల రూపాయలు పెట్టి 2.0ను తెలుగులో విడుదల చేస్తున్నాడు నిర్మాత ఎన్వీ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో  2.0ను విడుదల చేయాలనేది ప్లాన్. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి రజనీకాంత్ సినిమాకు థియేటర్లు బాగానే దొరుకుతాయి.

ఎటొచ్చి తెలుగులో ఎలాంటి ప్రచారం లేకుండా వస్తున్న ఈ సినిమా.. నిర్మాతను ఒడ్డున పడేస్తుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న. 

జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్