వెంకీ.. ఆ సినిమా రీమేక్ పై కన్ను?

రీమేక్ సబ్జెక్టులు అంటే విక్టరీ వెంకటేష్ కు ఎనలేని ప్రేమ! ఇప్పటి వరకూ తన కెరీర్ లో లెక్కకు మించి రీమేక్ సినిమాలు చేసిన నేపథ్యం ఉంది ఈ హీరోకి. ప్రస్తుతం వెంకీ చేతిలో…

రీమేక్ సబ్జెక్టులు అంటే విక్టరీ వెంకటేష్ కు ఎనలేని ప్రేమ! ఇప్పటి వరకూ తన కెరీర్ లో లెక్కకు మించి రీమేక్ సినిమాలు చేసిన నేపథ్యం ఉంది ఈ హీరోకి. ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్నది కూడా రీమేక్ సబ్జెక్టే! తమిళ, హిందీ భాషల్లో మాధవన్ చేసిన సినిమాను తెలుగులో ‘గురు’ గా రీమేక్ చేస్తున్నాడు వెంకీ.

ఇక ఈ హీరోకి దర్శకుడు కిషోర్ తిరుమల ఒక కథను చెప్పాడు. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే పేరుతో ఆ సినిమాపై ప్రచారం జరిగినా, అది పట్టాలెక్కలేదు. పట్టాలు ఎక్కేలా కూడా లేదు! ఎందుకో ఆ కథ అంటే వెంకీకి అంత ఆసక్తి కలగడం లేదట. అలాగే పూరీ ఒక కథ చెప్పినా.. అది కూడా వెంకీకి పూర్తిగా ఎక్కలేదట! ఈ నేపథ్యంలో వెంకీ మరో రీమేక్ సబ్జెక్ట్ మీదే దృష్టి సారించాడని సమాచారం.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ముంతిరివల్లికల్ తలిర్ క్కుంబల్’ సినిమాను రీమేక్ చేయడంపై ఆసక్తి తో ఉన్నాడట వెంకీ. గత ఏడాది ఆఖర్లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ మంచి హిట్ అయ్యింది. మోహన్ లాల్ కు జంటగా మీనా నటించింది. ఈ నేపథ్యంలో వెంకీ ఈ సినిమా రీమేక్ చేయనున్నాడనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ లాల్- మీనాలు జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమాను వెంకీ రీమేక్ చేశాడు. ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో మలయాళ సినిమా రీమేక్ పట్ల వెంకీ ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది!