మనసుకు నచ్చిందా.. లేక డబ్బు కోసమా?

బాహుబలి-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో సంగీత దర్శకుడు కీరవాణి తన ట్వీట్స్ తో దుమారం రేపిన సంగతి ఇప్పటికీ చాలా మందికి గుర్తే. “ఇండస్ట్రీలో ఎక్కువమంది బుర్రలేని వాళ్లతో పనిచేశాను. పరిశ్రమలో గుడ్డి-చెవిటి…

బాహుబలి-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో సంగీత దర్శకుడు కీరవాణి తన ట్వీట్స్ తో దుమారం రేపిన సంగతి ఇప్పటికీ చాలా మందికి గుర్తే. “ఇండస్ట్రీలో ఎక్కువమంది బుర్రలేని వాళ్లతో పనిచేశాను. పరిశ్రమలో గుడ్డి-చెవిటి దర్శకులే ఎక్కువమంది ఉన్నారు. కేవలం డబ్బు కోసమే అలాంటి బుద్ధిలేని దర్శకులతో పనిచేశాను.” అప్పట్లో కీరవాణి ట్వీట్స్ ఇవి.

అలా ఎడాపెడా తిట్టిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించాడు కీరవాణి. అలా ప్రకటించిన తర్వాత మరో సినిమా ఎనౌన్స్ చేయని ఈ సంగీత దర్శకుడు, ఎట్టకేలకు ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. అదే సవ్యసాచి. బాహుబలి-2 తర్వాత కీరవాణి నుంచి రాబోతున్న మూవీ ఇదే.

గతంలో బుర్రలేని వాళ్లతో పనిచేశానని స్టేట్ మెంట్ ఇచ్చిన కీరవాణి భవిష్యత్తులో.. తన మనసుకు నచ్చిన దర్శకులతోనే వర్క్ చేస్తానని, తన మైండ్ సెట్ కు దగ్గరగా ఉన్న వ్యక్తుల సినిమాలకే మ్యూజిక్ ఇస్తానని ప్రకటించాడు. సో.. ఇప్పుడు చందు మొండేటి కీరవాణి మనసుకు నచ్చాడని అనుకోవాలా.. లేక మరోసారి డబ్బు కోసమే సవ్యసాచి సినిమా ఒప్పుకున్నాడని అనుకోవాలా..?