కయ్యానికి కారణమవుతున్న ‘కన్నప్ప’

చాలా కాలం కిందటి సంఘటన. అందరికీ తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయాలన్నది, ఆ పాత్ర పోషించాలన్నిది నందమూరి తారక రామారావు అభీష్టం. కానీ వున్నట్లుండి హీరో కృష్ణ ఆ సినిమా చేస్తున్నట్లు…

చాలా కాలం కిందటి సంఘటన. అందరికీ తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయాలన్నది, ఆ పాత్ర పోషించాలన్నిది నందమూరి తారక రామారావు అభీష్టం. కానీ వున్నట్లుండి హీరో కృష్ణ ఆ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఎన్టీఆర్ కబురు చేయడం, కానీ కృష్ణ వినకపోవడం జరిగిందని, ఆ తరువాత ఆ వైరం చిరకాల కొనసాగిందని టాలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకుంటారు.
కట్ చేస్తే..

ఇప్పుడు మళ్లీ అలాంటి సీన్ నడుస్తోంది.

ఇప్పుడు అందుకు కారణమైన పాత్ర భక్త కన్నప్ప. ఇబ్బందికర పరిస్థితి నెలకొంటున్నది ఒకప్పటి హీరోలు కృష్ణం రాజు, మంచు మోహన్ బాబుల నడుమ. 

బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమా తీసింది కృష్ణం రాజే. అందులో ఆ పాత్ర ఆయనే పోషించారు. మరుపురాని సినిమాగా మిగిలింది. తిరిగి అదే సినిమాను మళ్లీ ప్రభాస్ హీరోగా తీయాలన్నది కృష్ణం రాజు సంకల్పం. 

అయితే పరమ శివభక్తుడు తనికెళ్ల భరణి. తిన్నా, తాగినా, నిద్రించినా శివమయమే. ఆయన ఓ మాంచి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు కన్నప్ప కథపై. దానిని సునీల్ హీరోగా చేయాలని తెగ ప్రయత్నించారు. కానీ బడ్జెట్ ఎక్కువ కావాలి. సునీల్ పై అంత పెట్టడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. 

దాంతో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వచ్చింది. హాలీవుడ్ సంస్థతో కలిసి దాన్ని చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సంగతి తెలిసి కృష్ణం రాజు అడ్డం పడుతున్నట్లు వినికిడి. తాను ప్రభాస్ తో చేయాలనుకుంటున్నానని, మీరెలా చేస్తారని మోహన్ బాబును అడిగారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. దీని  మీదా వ్యవహారం నడుస్తోంది. 

నిజానికి కన్నప్ప కథ పురాణ గాథ. అది ఎవరి స్వంతమూ కాదు. పేటెంట్ హక్కులు లేవు. తీయద్దు అనడానికి వీలు లేదు. కావాలంటే ఇద్దరూ తీసుకోవచ్చు. దానవీరశూరకర్ణ-కురుక్షేత్రం మాదిరిగా ఎవరి స్టామినా వారు చూపించుకోవచ్చు. అంతే కానీ నేనే తీస్తా, మీరు తీయద్దు అనడం కృష్ణం రాజు అనడం అంత సబబు కాదేమో?

ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే..ప్రభాస్ కు ఈ సబ్జెక్ట్  ఇప్పట్లో చేయడం అంతగా ఇష్టం లేదట. అయితే పెదనాన్న మాట దాటలేడు. అవుననలేడు..కాదనలేడు. అందువల్ల ఈ సబ్జెక్ట్ విష్ణు చేసేసుకుంటే హ్యాపీగా వుండేది ప్రభాసేనని టాలీవుడ్ గుసగుస.