మార్చి 1 నుంచి సినిమాల స్ట్రయిక్

జరుగుతుందా? పరిష్కారం అవుతుందా? అన్నది పక్కన పెడితే మార్చి 1నుంచి మాత్రం సినిమాలు బంద్ చేయాలని ఫిల్మ్ చాంబర్ తీర్మానించేసింది. ముల్లు పోయి కత్తి వచ్చే అన్నట్లువుంది ఇప్పుడు నిర్మాత పరిస్థితి. ఎందుకంటే డిజిటలైజేషన్…

జరుగుతుందా? పరిష్కారం అవుతుందా? అన్నది పక్కన పెడితే మార్చి 1నుంచి మాత్రం సినిమాలు బంద్ చేయాలని ఫిల్మ్ చాంబర్ తీర్మానించేసింది. ముల్లు పోయి కత్తి వచ్చే అన్నట్లువుంది ఇప్పుడు నిర్మాత పరిస్థితి. ఎందుకంటే డిజిటలైజేషన్ జరిగిన తరువాత, ఫిలిం ఖర్చులు, ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గాయి అని సంబర పడ్డారు.

కానీ మెలమెల్లగా థియేటర్లు అన్నీ డిజిటలైజేషన్ జరిగిపోయిన తరువాత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్ డీ వంటివి మెల్లగా చార్జీలు పెంచడం ప్రారంభించాయి. దీనిపై చాలా కాలంగానే నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇదేమంత సీరియస్ టర్నింగ్ తీసుకోలేదు.

ఎందుకంటే క్యూబ్, యుఎఫ్ ఓ వంటి వాటి వెనుక లోకల్ మద్దతు దారులుగా సురేష్ బాబు, అరవింద్ లాంటి వాళ్లు వున్నారు. కానీ ఇప్పుడు రాను రాను నిర్మాతల ఆందోళన పెరిగింది. క్యూబ్ ఖర్చులు మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో అధికంగా వున్నయన్న ఆరోపణలు, విమర్శలు వున్నాయి.

అందువల్ల ఇప్పుడు ఛాంబర్ ఈ విషయంపై దృష్టి సారించింది. ఎన్ని సమావేశాలు పెట్టినా, క్యూబ్, యుఎఫ్ఓ ప్రతినిధులు ఎవ్వరూ రావడం లేదు. దాంతో మొన్న 8వ తేదీన సమావేశమై మార్చి 1నుంచి అన్ని థియేటర్లు మూసి వేయాలని తీర్మానం చేసారు.

అంతే కాదు, మార్చి 1నుంచి షూటింగ్ లు కూడా బంద్ చేయాలని తీర్మానించారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ సర్కులర్ ను సభ్యులందరకు పంపించింది. మరి ఇప్పుడైనా క్యూబ్, యుఎఫ్ఓ జనాలు కదలి వస్తారేమో? ఎందుకంటే మార్చి టైమ్ లో బోలెడు భారీ సినిమాలు విడుదలను ప్లాన్ చేసుకుని వున్నాయి. పైగా పరిశ్రమ మొత్తం స్తంభించడం అంటే చిన్న విషయం కాదు కదా?