మీడియా కాకుంటే సోషల్ మీడియా

కార్యకర్తల వివరాలు కంప్యూటరైజ్ చేయడం, ప్రత్యేకంగా జర్నలిస్టులను నియమించి, ఆ మీడియా విభాగంతో ఎప్పటికప్పుడు నాయకులకు ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో? పాయింట్లు అందేలా చేసి, ఎప్పటికప్పుడు ఫోటోషాప్ ఇమేజ్ లను ఫేస్ బుక్…

కార్యకర్తల వివరాలు కంప్యూటరైజ్ చేయడం, ప్రత్యేకంగా జర్నలిస్టులను నియమించి, ఆ మీడియా విభాగంతో ఎప్పటికప్పుడు నాయకులకు ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో? పాయింట్లు అందేలా చేసి, ఎప్పటికప్పుడు ఫోటోషాప్ ఇమేజ్ లను ఫేస్ బుక్ లో వదిలి, ఇలా రకరకాలుగా ప్రజలను ప్రభావితం చేసే మార్గం చేపట్టింది తొలిసారిగా తెలుగుదేశం పార్టీనే.

అయితే కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడానికి కూడా ఇదే బాటపట్టారు. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు. గత ఎన్నికల తరువాత వైకాపా సోషల్ మీడియా విభాగం కూడా పటిష్టమైంది. ఎక్కడిక్కడ కౌంటర్ పబ్లిసిటీ చేసుకుంటూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా గట్టిగా పనిచేస్తోంది. ఫేస్ బుక్ , ట్వీట్టర్ లు వేదికలుగా జనసేనకు ఎక్కడలేని ప్రచారం తెస్తోంది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఆల్ మోస్ ప్రింట్ మీడియా, విజువల్ మీడియా మొహం చాటేసినట్లే. ఎక్కడా ఎటువంటి కవరేజ్ లేదు. గతంలో ఇవే మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ కాలు కదిపితే చాలు అక్షరాభిషేకాలు చేసేవి. కానీ ఇప్పుడు తెలుగుదేశం జట్టు కట్ అనడంతో మీడియా కూడా కచ్చి అనేసింది.

ఇప్పుడు ఆఖరికి సోషల్ మీడియానే అనివార్యం అయింది. బాబుగారు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టినా వాలిపోయి నానా హడావుడీ చేసే మీడియా నిన్నటికి నిన్న విశాఖలో పవన్ చేసిన కవాతు కార్యక్రమాన్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం గట్టిగానే పట్టుకుంది. జనసేన మీడియా విభాగం అయితేనేం, యువత తమకు అందుబాటులోకి వచ్చిన ఫేస్ బుక్ లైవ్ లాంటి టెక్నాలజీతో అయితేనేం, జనాలకు బాగానే చేరువచేసారు.

మొత్తంమీద చూసుకుంటే, ఇప్పుడు దేశం సోషల్ మీడియా వింగ్ నే వెనకపడినట్లు కనిపిస్తోంది. తమకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అండగా వుందన్న భావంకావచ్చు, లేదా అధికారంలో వున్న తాత్సారం కావచ్చు. మొత్తంమీద సోషల్ మీడియాలో ఇప్పుడు తెలుగుదేశం వెనకబడినట్లే.

అన్నింటికన్నా ముందుగా జనసేన, ఆపై వైకాపా వెళ్తున్నాయి. జనసేన ట్విట్టర్ ను, ఫేస్ బుక్ ను, యూట్యూబ్ ను వాడుతుంటే, వైకాపా ఎక్కువగా ఫేస్ బుక్ మీద ఆధారపడుతోంది. పరిస్థితి ఇలావుంటే నా కోడి కుంపటి లేకుంటే తెల్లారదు అనే టైపులోనే మన మీడియాలో మెజార్టీ సామాజిక మీడియా మాత్రం తెలుగుదేశం పల్లకీనే మోస్తోంది.