‘మెగా’ వైరం ముగిసిన అధ్యాయం

మెగాస్టార్ చిరంజీవితో తమ వైరం ఏనాడో ముగిసిన అధ్యాయం అని అన్నారు నటి జీవిత. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఆమె చేరిక పై నిర్మాత బండ్ల గణేష్ అభ్యంతరం చెప్పడం…

మెగాస్టార్ చిరంజీవితో తమ వైరం ఏనాడో ముగిసిన అధ్యాయం అని అన్నారు నటి జీవిత. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఆమె చేరిక పై నిర్మాత బండ్ల గణేష్ అభ్యంతరం చెప్పడం పై ఆమె గ్రేట్ ఆంధ్ర తో మాట్లాడారు. 

బండ్ల గణేష్ ఎందుకు ఈ పాయింట్ తీసారో తనకు తెలియదని, ఇంకా ఎన్నాళ్లు ఇదే పాయింట్ పట్టుకుని వేలాడతారని ఆమె ప్రశ్నించారు. అప్పట్లో మెగాస్టార్ పాయింట్ ఆయనకు కరెక్ట్, తమ పాయింట్ తమకు కరెక్ట్. అదంతా అయిపోయి చాలా ఏళ్లయిపోయింది. ఇంకా అదే లాగడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో తమతో పాటు పోటీ చేసి గెలచి, తనతో కలిసి పని చేసిన వారెంతో మంది ప్రకాష్ రాజ్ ప్యానల్ లో వున్నారని, అందువల్ల వారి కోరిక మేరకు తాను కూడా అటు వెళ్లానని, ప్రకాష్ రాజ్ కూడా తనను కలవడం, ఫోన్ లో మాట్లాడడం జరిగిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నా అని ఆమె అన్నారు. అంతకు మించి ఇందులో రాజకీయాలేం లేవని జీవిత స్పష్టం చేసారు.

బండ్ల గణేష్ అసంతృప్తి ఏమిటో? దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటో తనకు అనవసరం అని, ఆయనతో తమకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని అన్నారు. గెలిచినా పని చేస్తాను, గెలవకున్నా నలుగురికి సాయం చేస్తాను. ఇదే తన ఎజెండా అని జీవిత స్పష్టం చేసారు.