కొనసాగుతున్న ట్రెండ్.. లిస్టులోకి మరో 2 సినిమాలు

టాలీవుడ్ లో రీ-రిలీజెస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే బిజినెస్ మేన్, పోకిరి, ఖుషి లాంటి 3-4 సినిమాలు తప్పిస్తే, మిగతా బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. రీసెంట్ గా…

టాలీవుడ్ లో రీ-రిలీజెస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే బిజినెస్ మేన్, పోకిరి, ఖుషి లాంటి 3-4 సినిమాలు తప్పిస్తే, మిగతా బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఛత్రపతి అయితే ఘోరంగా దెబ్బతింది. ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదంటే రీ-రిలీజెస్ ట్రెండ్ ఎటు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక రీ-రిలీజెస్ అపేస్తే బెటర్ అనే చర్చ మొదలైన తరుణంలో, మరో 2 సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి నటించిన ఈ రీమేక్ సినిమాను ఈ వీకెండ్ విడుదల చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రయిలర్ కూడా కట్ చేశారు.

ఈ ట్రయిలర్ ను నాగబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాతే, నాగబాబు, తన కొడుకు పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. ఈ సినిమా పెద్ద హిట్టవుతుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే, ప్రస్తుతం థియేటర్లలో గట్టిగా నిలబడిన సినిమా లేదని, వీకెండ్ కూడా పెద్ద సినిమాలు లేవనేది వీళ్ల వాదన.

ఇక నవంబర్ నెలలో రీ-రిలీజ్ కు సిద్ధమైన మరో సినిమా అదుర్స్. ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను నవంబర్ 18న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి సినిమా థియేటర్లలోకొచ్చి చాన్నాళ్లయింది. కాబట్టి అదుర్స్ రీ-రిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే గట్టిగా ప్రచారం చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను ఏకంగా 400 థియేటర్లలో ప్రసారం చేశారు.

ఇలా నవంబర్ నెలలో అలనాటి 2 పెద్ద హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. రీ-రిలీజ్ ట్రెండ్ ను ఇవి కొత్త పుంతలు తొక్కిస్తాయా లేక గుంపులో కలిసిపోతాయో చూడాలి.