కరోనా కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. చాలా వరకు ఇప్పుడిప్పుడే మెలమెల్లగా ప్రారంభం అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విదేశాల్లో షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో షూట్ చేయాల్సి వుండడం, అక్కడ కరోనా భయంకరంగా వ్యాప్తి చెందడంతో ఆ సినిమాలు అలా వుండిపోయాయి.
మహేష్ నటించే సర్కారువారి పాట సినిమా అమెరికా షెడ్యూలు ఆపేసారు. ఇక్కడ లోకల్ చేసే వర్క్ జనవరి నుంచి చేయాలని అనుకుంటున్నారు. కానీ పూరి జగన్నాధ్ సినిమా ఒకటి వుంది.
అది చాలా వరకు అమెరికాలో, విదేశీ నటుల భాగస్వామ్యంతో చేయాల్సి వుంది. కానీ వీలు కాదు కనుక జనవరి నుంచి యూరప్ దేశాల్లో ఎక్కడో అక్కడ చేద్దాం అని అనుకుంటూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు యూరప్ పరిస్థితి కూడా బాగులేదు. ఒక్కో దేశం లాక్ డౌన్ నో, కర్ఫ్యూనో ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పట్లో అక్కడ కూడా అవకాశం దొరికేలా లేదు. అలాగే ఆ సినిమా ముంబాయి వీధుల్లో చేయాల్సి వుంది. మహరాష్ట్ర కూడా కొత్తగా ఆంక్షలు విధిస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే పూరి సినిమా ఇప్పట్లో సెట్ మీదకు వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.