ఆదిపురుష్-నైజాం రచ్చ మామూలుగా లేదుగా

నైజాంలో అంతే.. నైజాంలో అంతే అనేసుకోవాల్సిందే. డీపాల్ట్ గా వున్న బయ్యర్లు కాకుండా కొత్త వాళ్లు ఎవరు సినిమా కొన్నా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అది ఎంత సౌండ్ పార్టీ అయినా పాట్లు తప్పవు.…

నైజాంలో అంతే.. నైజాంలో అంతే అనేసుకోవాల్సిందే. డీపాల్ట్ గా వున్న బయ్యర్లు కాకుండా కొత్త వాళ్లు ఎవరు సినిమా కొన్నా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అది ఎంత సౌండ్ పార్టీ అయినా పాట్లు తప్పవు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య విడుదల టైమ్ కు ఇదే సమస్య. మళ్లీ ఇప్పుడు ఆదిపురుష్ కు ఇదే సమస్య. థియేటర్ అడ్వాన్స్ లు అనుకున్న మేరకు రావు, అద్దెలు అమాంతం పెరిగిపోతాయి. ఇలా ఒకటి కాదు. రెండు కాదు.

సాధారణంగా ఈ స్ట్రక్చర్ ఎలా వుంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్ కు వున్న క్రెడిబులిటీ, నమ్మకం, సినిమా స్టామినా ఇవన్నీ బట్టి థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు వస్తాయి. అవన్నీ కలిపి, తన స్వంత సొమ్ము జోడించి నిర్మాతకు ఇస్తారు డిస్ట్రిబ్యూటర్. ఇదీ ప్రాసెస్.

ఆదిపురుష్ సినిమాను నైజాం ఏరియాకు 50 కోట్ల నాన్ రిటర్నబుల్, 10 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ బేసిస్ లో కొన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఆ మేరకు కాకపోయినా కనీసం ఓ నలభై నుంచి యాభై కోట్లు అయినా అడ్వాన్స్ లు థియేటర్ల నుంచి రావాలి. కానీ అక్కడే వచ్చింది సమస్య. పెద్ద ఎగ్జిబిటర్ల నుంచి సహాయనిరాకరణ ఎదురయింది. సంక్రాంతి టైమ్ లో ఇచ్చిన రేషియోలో కూడా అడ్వాన్స్ లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

సరే, ఏదో విధంగా స్వంత సొమ్ము జతచేద్దాం అని అనుకుంటే, మరో వైపు నుంచి ఇంకో విధమైన ట్రీట్ మెంట్ ఎదురైంది. సంక్రాంతి టైమ్ లోనే రెంట్లు పెంచేసారు. ఇప్పుడు మళ్లీ అంతకన్నా పెంచి లిస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. అసలే థియేటర్లకు సినిమాలు లేవు, అడ్వాన్స్ లు ఇవ్వలేము అంటూ, థియేటర్ల రెంట్లు పెంచడం ఏమిటి అన్నది వీళ్ల బాధ.

ఇలా అన్ని వైపుల నుంచి ఆదిపురుష్ బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ ను టార్గెట్ చేస్తున్నారు.