అల వైకుంఠపురం ఓ పండగ ఫీస్ట్

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు)…

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇవి. 

* ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది,  అంచనాలు పెరిగిపోతాయి. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే.

*అందుకే ఈ సినిమాలు చేసా
'అరవింద సమేత' నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా. 'అజ్ఞాతవాసి' ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా  ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా  ఉండే సాంగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ  మైండ్లోకి కూడా రానివ్వలేదు.  'అరవింద తర్వాత' మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే 'అల వైకుంఠపురములో' సినిమా తీశా.

*రెండు సినిమాలు వేరు వేరు
*సినిమాలు చూశాక 'సరిలేరు నీకెవ్వరు' జానర్, 'అల వైకుంఠపురములో' జానర్ వేర్వేరుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతారని నేననుకుంటున్నా. ట్రైలర్ లను బట్టే అవి భిన్న తరహా కథలని తెలిసిపోతుంది. 

*స్థాయి..స్ధానం
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.

*అభిమానం అంతా పనితీరుకే
ప్రేక్షకులు అభిమానించేది మనం ఇచ్చే వర్కుని, మనల్ని కాదు. దాన్ని డిటాచ్డ్ గా  చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం. కాబట్టి ఆ సినిమా వరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున్న సినిమాని చూస్తారు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. 

*నాకు సంగీతం రాదు
నాకు సంగీతం రాదు, పాడ్డం రాదు. నాలో ఎన్నో కోరికలు.. గిటారు వాయించాలని, అమ్మాయిలు నావైపు ఆరాధనగా చూడాలని.. ఉండేవి. కానీ నాకు ఏవీ రావు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఒక్క సిద్ శ్రీరాం వాయిస్ తప్ప, లైవ్ గా  ఎగ్జాక్టుగా మీరు ఏ పాటైతే ఇప్పుడు వింటున్నారో దాన్ని తమన్ నాకు వినిపించేశాడు. అప్పుడు 'సామజవరగమన' అనేది పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశానంతే. శాస్త్రి గారికి చెబితే, 45 నిమిషాల్లో పాట రాసేశారు. ఈ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని  చెప్పింది బన్నీ. అప్పుడు ఆలోచించి, తమన్, సిద్ శ్రీరాం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు షూట్ చేసి రిలీజ్ చేశాం. కాకినాడలో షూటింగ్ జరిగేటప్పుడు బన్నీ, నేను, తమన్.. ముగ్గురం కూర్చొని.. 'సామజవరగమన', 'రాములో రాములా', 'ఓమైగాడ్ డాడీ' పాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని మూడు పేజీలు రాసుకున్నాం. అప్పటికి ఆ మూడు పాటలూ ట్యూన్స్ పూర్తయి ఉన్నాయి.

*ముందుగా తెలియదు
చీర నేసినవాడికి దాని అందం తెలీదు. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతాడు. పూర్తయిన తరువాతే తెలుస్తుంది అనుకున్నట్లు వచ్చిందా లేదా అన్నది. నేనూ అంతే. నా సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. ఒక సినిమాతో నేనింత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడూ అనుకొని చెయ్యడు. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు. తర్వాత ఆ కథకు అతను బానిస.

* స్ట్రీలపై గౌరవం?
1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. రాను రాను మారింది. ఆడవాళ్లు మౌనంగా వున్నారు. దాంతో అనుకోని లేదా తెలియని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వంటివి అలవాటైపోయాయి.  'అత్తారింటికి దారేది' అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. 

* ఇల్లే కీలకం ?
మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే 'హోం కమింగ్' అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. 'అల.. వైకుంఠపురములో' మూవీలో 'వైకుంఠపురం' అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా  పెట్టా.

* మీరు పాన్-ఇండియా సినిమా
పాన్-ఇండియాకు వెళ్లకపోవడానికి నాకు కరెక్ట్ కథ తగలకపోవడం, నేనింకా అలాంటి కథ రాయలేకపోవడం.

* తర్వాత ఎవరితో సినిమా చెయ్యబోతున్నారు?
తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ అవలేదు. కథ అల్లుకొని, దానికి ఎవరు సరిపోతారనుకుంటే వాళ్లతో చేస్తా.