ఎట్టకేలకు మురుగదాస్ నుంచి మరో మూవీ

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం ఏంటని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. అతడు సినిమా తీసి ఏళ్లు గడుస్తోంది. రజనీకాంత్ తో అతడు తీసిన దర్బార్ సినిమా 2020లో రిలీజైంది. అంతే..…

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం ఏంటని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. అతడు సినిమా తీసి ఏళ్లు గడుస్తోంది. రజనీకాంత్ తో అతడు తీసిన దర్బార్ సినిమా 2020లో రిలీజైంది. అంతే.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు ఈ డైరక్టర్. ఒక దశలో ఇతడు దర్శకత్వం వదిలేశాడనే పుకార్లు కూడా వినిపించాయి. ఎట్టకేలకు మురుగదాస్ నుంచి మరో మూవీ రాబోతోంది.

శివ కార్తికేయన్ హీరోగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు మురుగదాస్. శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్ పై ఈ పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమా తనకు అన్ని విధాలా ప్రత్యేకమైనదని, షూటింగ్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేశాడు. దీనికి మురుగదాస్ కూడా స్పందించాడు. ఇద్దరం కలిసి సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టిద్దామన్నాడు.

నిజానికి ఓ సినిమా కోసం ఇలా కలిసి పనిచేయడం మురుగదాస్-శివకార్తికేయన్ కు కొత్త కాదు. గతంలో ఇద్దరూ కలిసి మాన్ కరాటే అనే సినిమా చేశారు. అయితే ఆ సినిమాకు మురగదాస్ దర్శకుడు కాదు. కథ మాత్రం అందించి, నిర్మాతగా మారి ఆ సినిమాను తెరకెక్కించాడు. మళ్లీ ఇన్నేళ్లకు తన దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా సినిమా చేయబోతున్నాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శివ కార్తికేయన్. అతడు నటించిన మహావీరుడు సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అయలాన్ అనే సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. మరోవైపు కమల్ హాసన్ నిర్మాతగా సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా లాక్ అయింది. ఇలా క్రేజీ లైనప్ తో దూసుకుపోతున్నాడు ఈ హీరో.