బాలీవుడ్ బ్యూటీస్.. సౌత్ మూవీస్

బాలీవుడ్ భామల్ని సౌత్ సినిమాల్లోకి తీసుకురావాలని చాలామంది మేకర్స్ ప్రయత్నించారు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో ఉంది సీన్. మంచి ప్రాజెక్టు సెట్ అయితే, స్వయంగా బాలీవుడ్ బ్యూటీస్, సౌత్ సినిమాలకు కాల్షీట్లు…

బాలీవుడ్ భామల్ని సౌత్ సినిమాల్లోకి తీసుకురావాలని చాలామంది మేకర్స్ ప్రయత్నించారు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో ఉంది సీన్. మంచి ప్రాజెక్టు సెట్ అయితే, స్వయంగా బాలీవుడ్ బ్యూటీస్, సౌత్ సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నారు. కొంతమంది హిందీ హీరోయిన్లు సౌత్ లో డెబ్యూ ఇస్తుంటే, మరికొంతమంది రీఎంట్రీ ఇస్తున్నారు.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్. ఈమె కాల్షీట్ల కోసం బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతుంటారు. అలాంటిది ఈ బ్యూటీ ఓ సౌత్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ ఈ సినిమాతో ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. గతంలో అలియా భట్ కోసం చాలామంది సౌత్ మేకర్స్ ప్రయత్నించారు కానీ ఆర్ఆర్ఆర్ తో అది సాధ్యమైంది.

దీపిక పదుకోన్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈమె కూడా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లలో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న నటి ఈమె. ఇలాంటి హీరోయిన్ ను సౌత్ కు రప్పించాలంటే చాలా కష్టమే. కానీ ప్రాజెక్ట్-కే సినిమాతో దీపికను ఒప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించబోతోంది దీపిక. అటు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌథేలా బ్లాక్ రోజ్ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

అందాల రాశి ఐశ్వర్య రాయ్ కు సౌత్ కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే సౌత్ సినిమాతోనే ఆమె హీరోయిన్ అయింది. దక్షిణాదిలో చాలా సినిమాలు చేసింది. ఎప్పుడైతే బాలీవుడ్ లో క్లిక్ అయిందో మళ్లీ సౌత్ వైపు చూడలేదు. ఆమధ్య రజనీకాంత్ సరసన రోబో సినిమా చేసినప్పటికీ, మళ్లీ బాలీవుడ్ కే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా  మరోసారి సౌత్ లోకి ఎంటరైంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 (పీఎస్-1) తో దక్షిణాదిన కనువిందు చేయబోతోంది ఈ సీనియర్ బ్యూటీ.

కృతి సనన్ కూడా మరోసారి సౌత్ పై కన్నేసింది. తెలుగులో మహేష్ బాబు సరసన వన్-నేనొక్కడినే, నాగచైతన్యతో దోచెయ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో సౌత్ లో మరోసారి హల్ చల్ చేయాలనుకుంటోంది ఈ చిన్నది. 

అటు కియరా అద్వానీ కూడా అంతే. ఇప్పటికే 2 తెలుగు సినిమాలు చేసింది. ఓవైపు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతూనే, మరోవైపు సౌత్ ప్రాజెక్టులకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

హీరోయిన్లు సోనాక్షి సిన్హా, జాన్వి కపూర్ కూడా సౌత్ వైపు చూస్తున్నారు. గతంలో ఓసారి సౌత్ లో రజనీకాంత్ సరసన ఓ సినిమా చేసిన సోనాక్షి.. ఇప్పుడు ఇంకోసారి సౌత్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అటు జాన్వి కపూర్ కూడా మంచి ప్రాజెక్ట్ సెట్ అయితే సౌత్ లో సినిమా చేసేందుకు రెడీ అంటోంది.