కరోనాను జయిస్తామని నటి, దివంగత హీరో చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ ధీమాగా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో మంగళవారం ఆమె షేర్ చేసిన ఓ ప్రకటన వైరల్ అవుతోంది. ఇంతకూ ఆ ప్రకటనలో ఏమున్నదంటే…
‘హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. గత కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం మేమంతా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం.
చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్ చిరు ఆరోగ్యం బాగుంది. నేను అన్ని వేళలా తనతోనే ఉంటున్నా. కావున ఎవరూ ఆందోళన చెందొద్దు. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం తప్పక గెలుస్తుంది. త్వరలోనే వైరస్ను జయించి మీ ముందుకొస్తాం’ అని మేఘన పేర్కొన్నారు.
కన్నడ హీరో చిరంజీవి సర్జా (36) ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చిరంజీవి మరణించే నాటికి ఆయన భార్య మేఘనా రాజ్ గర్భవతి. అప్పట్లో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కానీ భర్త జ్ఞాపకాలు చిరంజీవిని సజీవంగా నిలిపాయని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
అక్టోబర్లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. చిరంజీవి ప్రతిరూపమే తన బిడ్డ అని ఆమె ఆనందంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు నెలల పసికందుతో పాటు మేఘనా, ఆమె తల్లిదండ్రులు కూడా కరోనాబారిన పడ్డారు. అయితే తాము కరోనా నుంచి త్వరగా బయటపడతామని ఆమె ప్రకటనలో విశ్వాసం కనిపించింది.
చిరంజీవి సర్జా కుటుంబానికి ఒక దాని తర్వాత ఒకటి కష్టాలు వెంటాడుతున్నాయని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.