పుకార్లే నిజమయ్యాయి.. అవును వాళ్లిద్దరూ విడిపోయారు

మ్యూజిక్ డైరక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, అతడి భార్య సింగర్ సైంధవ్ విడిపోయినట్టు 2 రోజులుగా వార్తలొస్తున్నాయి. వీటిపై తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ స్పందించాడు. పుకార్లను నిజం చేస్తూ, తామిద్దరం విడిపోయామనే విషయాన్ని…

మ్యూజిక్ డైరక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, అతడి భార్య సింగర్ సైంధవ్ విడిపోయినట్టు 2 రోజులుగా వార్తలొస్తున్నాయి. వీటిపై తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ స్పందించాడు. పుకార్లను నిజం చేస్తూ, తామిద్దరం విడిపోయామనే విషయాన్ని జీవీ స్పష్టం చేశాడు.

తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు జీవీ ప్రకాష్ కుమార్ ప్రకటించాడు. సైంధవితో చర్చించి, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు జీవీతో పాటు, సైంధవి విడివిడిగా సోషల్ మీడియాలో తమ సెపరేషన్ విషయాన్ని బయటపెట్టారు.

జీవీ ప్రకాష్, సైంధవి అందరిలాంటి కపుల్ కాదు. చిన్నప్పట్నుంచి వీళ్లకు ఒకరితో ఒకరికి పరిచయం. కలిసి పెరిగారు. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆ తర్వాత లవ్ లో పడ్డారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. తామిద్దరం దాదాపు రెండేళ్లు ఆలోచించి, చర్చించి మరీ పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని గతంలో సైంధవి వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

ఇంత అవగాహనతో పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన వీళ్లు, ‘ఉన్నఫలంగా’ విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా షాక్. ఇక్కడ ఉన్నఫలంగా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సరిగ్గా ఏడాది కిందటే (ఏడాది కూడా పూర్తవ్వలేదు) తమ వైవాహిక జీవితంపై, భర్తపై ఎంతో ప్రేమతో పోస్ట్ పెట్టింది సైంధవి.

పదేళ్ల వైవాహిక జీవితం పూర్తయిన సందర్భంగా భర్తను పొడుగుతూనే, చిరకాలం అతడితోనే కలిసి జీవించాలని ఉందంటూ రాసుకొచ్చింది. పోస్టులో అంత ప్రేమను కురిపించిన కొన్ని నెలలకే విడాకులు తీసుకోబోతున్నామంటూ ఇద్దరూ ప్రకటించారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.