న‌రేష్‌పై హేమ ఘాటు వ్యాఖ్య‌లు

‘మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌పై న‌టి, అధ్య‌క్ష బ‌రిలో ఉన్న హేమ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలిగా ఉన్న‌ హేమ తోటి న‌టీన‌టుల‌కు పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో విస్తృతంగా…

‘మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌పై న‌టి, అధ్య‌క్ష బ‌రిలో ఉన్న హేమ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలిగా ఉన్న‌ హేమ తోటి న‌టీన‌టుల‌కు పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా ‘మా’ ఎన్నిక‌ల‌ను వెంట‌నే పెట్టాల‌నే డిమాండ్ అందులో ఉన్న‌ప్ప‌టికీ, మ‌రోవైపు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేష్‌పై విమ‌ర్శ‌లున్నాయి. దీంతో ఈ వాయిస్ మెసేజ్‌కు ప్రాధాన్యం ల‌భించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హేమ వాయిస్ వైర‌ల్ అవుతోంది.

‘మా’ ఎన్నిక‌ల అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్‌లో వ‌ర్గాలుగా విడిపోయి రాజ‌కీయాలు మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా అధ్య‌క్ష బ‌రిలో ఉన్న మంచు విష్ణు ఇటీవ‌ల సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ న‌టులు మౌనంగా ఉంటున్న‌ప్ప‌టికీ, అంత‌ర్గ‌తంగా తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇక హేమ వాయిస్ మెసేజ్ విష‌యానికి వ‌స్తే… అందులో ప్ర‌ధానంగా ఏమున్న‌దో చూద్దాం.

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలివారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. 

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇది వరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. 

ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి’ అని వాయిస్ మెసేజ్ ద్వారా హేమ అప్పీల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

‘ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు. ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి’ అనే వ్యాఖ్య‌ల‌పై న‌రేష్ అభిమానులు, అనుచ‌రులు మండిప‌డుతున్నారు. 

ఎవ‌రికో మేలు చేసేందుకే హేమ వాయిస్ మెసేజ్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నార‌ని న‌రేష్ స‌న్నిహితులు మండిప‌డుతున్నారు. ఈ ఆడియో రికార్డులో మ‌రికొన్ని సంగ‌తులు కూడా ఉన్నాయి. మొత్తానికి తాను కూడా సీరియ‌స్ కంటెస్టెంట్‌నే అనే మెసేజ్‌ను ఈ వాయిస్ రికార్డ్‌తో హేమ పంప‌గ‌లిగార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.