మంచు ఫ్యామిలీని కెలకడమే మెగా లక్ష్యమా?

నాగశ్రీను అనే తన పర్సనల్ హెయిర్ డ్రస్సర్.. తన ఆఫీసు నుంచి అయిదు లక్షల రూపాయల విలువైన మేకప్ వస్తువులతో సహా పారిపోయాడని, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు…

నాగశ్రీను అనే తన పర్సనల్ హెయిర్ డ్రస్సర్.. తన ఆఫీసు నుంచి అయిదు లక్షల రూపాయల విలువైన మేకప్ వస్తువులతో సహా పారిపోయాడని, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందినప్పుడు.. ఆ వార్త చాలా చిత్రంగా అనిపించింది. 

మామూలుగానే మంచు ఫ్యామిలీకి సినిమా వర్గాల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వారివద్ద పనిచేసేవారు కూడా అంతే భయభక్తులతో ఉంటారు. అలాంటిది హెయిర్ డ్రస్సర్ మీద అయిదు లక్షల వస్తువుల చోరీ కేసు, అది కూడా స్పష్టత లేకుండా, అనుమానంతో పెట్టడం అనేది చిత్రంగా అనిపించింది. ఈ పోలీసు కేసు బనాయించడం వెనుక అసలు కారణం ఇంకేదో ఉందని, పైకి చిన్న చోరీ నెపం పెడుతున్నారని చాలా మంది అనుకున్నారు. 

ఈలోగా అదే హెయిర్ డ్రస్సర్ నాగశ్రీను కుటుంబానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించింది. ఆ ఫ్యామిలీ నుంచి సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉండే ఫైర్ బ్రాండ్ నాగబాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీలోని పరిచయస్తులకు పెద్ద హీరోల నుంచి ఇలాంటి ఆర్థిక సహాయాలు కొత్త కాదు. 

కానీ, నాగశ్రీనుకు అతను పనిచేస్తున్న పాత కంపెనీ సరిగా జీతం ఇవ్వడం లేదని, ఈలోగా తల్లి ఆరోగ్యం పాడైందని, కష్టాల్లో ఉన్నందుకే నాగబాబు సాయం చేశాడని.. మానవీయ కోణం జోడించడం చర్చకు దారితీసింది. ఈలోగా, మంచు ఫ్యామిలీనుంచి నాగశ్రీనుకు రెగ్యులర్ గా జీతాలు చెల్లిస్తూనే ఉన్నామంటూ మరో ఖండన కూడా వచ్చింది. 

ఈ వ్యవహారం మొత్తం చూస్తున్న వారికి ఎలా అనిపిస్తున్నదంటే.. మంచు విష్ణు నుంచి చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేసుకున్న నాగ శ్రీను వారి ఫ్యామిలీనుంచి తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. నాగబాబు ఆశ్రయంలోకి వచ్చి చేరాడా.. మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు దన్ను తనకు ఉన్నదని చాటుకోదలచుకుంటున్నాడా అనే అభిప్రాయం కలుగుతోంది. 

విష్ణుతో నాగబాబుకు మా ఎన్నికల సమయం నుంచి పచ్చిగడ్డి వేసినా భగ్గుమంటున్న వాతావరణం ఉండనే ఉంది. ఆ నేపథ్యంలో విష్ణుకు సంబంధించిన ఒక పర్సనల్ వ్యవహారంలోకి నాగబాబు తలదూర్చాడా? మంచు ఫ్యామిలీని కెలకడమే లక్ష్యంగా అనుకున్నాడా? అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది. 

ఇద్దరు పెద్దవాళ్లు ఇలా తలపడితే.. మధ్యలో నాగశ్రీను లాంటివాళ్లు ఉన్నప్పుడు పావులుగా మారేది మాత్రం వాళ్లే అని పలువురు అనుకుంటున్నారు.