అర్జున్ రెడ్డి డైరక్టర్ ను పక్కనపెట్టిన మహేష్

మహేష్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఫిక్స్ అనుకున్నారంతా. ఎప్పుడైతే సందీప్ రెడ్డి మరో హిందీ సినిమా ప్రకటించాడో అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలు నిజమేనని కన్ ఫర్మ్…

మహేష్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఫిక్స్ అనుకున్నారంతా. ఎప్పుడైతే సందీప్ రెడ్డి మరో హిందీ సినిమా ప్రకటించాడో అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలు నిజమేనని కన్ ఫర్మ్ చేశాడు మహేష్. తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లితో తీయబోతున్నట్టు ప్రకటించాడు.

“పదేళ్లుగా నాన్-స్టాప్ గా పనిచేస్తున్నాను. కానీ బయట ఎలా కనిపిస్తోందంటే.. నేను ప్రతి 3 నెలలకు హాలిడేస్ కు వెళ్లిపోతున్నానని అనుకుంటున్నారు. కానీ అలా వెళ్లను. పిల్లల శెలవుల్లో వాళ్లను తీసుకెళ్తాను. నా బ్రెయిన్ మాత్రం ఎప్పుడూ వర్క్ మీదే ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత 3 నెలలు బ్రేక్ తీసుకుంటాను. వంశీ పైడిపల్లి సినిమా ఆల్రెడీ ఓకే చేశాను. అతడు రెడీ అయ్యేలేపు నేను 3 నెలలు బ్రేక్ తీసుకుంటాను.”

ఇలా మహర్షి తర్వాత మరోసారి వంశీ పైడిపల్లితో వర్క్ చేయబోతున్న విషయాన్ని బయటపెట్టాడు మహేష్. సో.. ఇప్పట్లో సందీప్ రెడ్డితో సినిమా ఉండదనే విషయాన్ని నిర్థారించాడు. అంతేకాదు.. సందీప్ రెడ్డి లాంటి డైరక్టర్లతో ఎందుకు పనిచేయలేమో కూడా పరోక్షంగా వెల్లడించాడు మహేష్.

“ప్రయోగాలు అనుకోవడానికి బాగుంటాయి కానీ, భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ కవర్ అవ్వాలి. అదే సమయంలో కొత్తదనం ఉండాలి. పెద్ద హీరోలందరం ఇప్పుడొక విచిత్రమైన జోన్ లో ఉన్నాం. మా సినిమాల్లో అన్నీ ఉండాలి. లేదంటే ట్రేడ్ ఇబ్బంది పడుతుంది. మనం కావాలని డిఫరెంట్ గా ఓ చిన్న సినిమా చేసేయలేం కదా. అన్నీ కుదరాలి. అప్పుడే ప్రయోగాలు.”

ఇలా సందీప్ రెడ్డితో సినిమా ప్రస్తుతానికి లేదనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టాడు మహేష్. ఇకపై కూడా తన సినిమాలకు తాను సహ-నిర్మాతగా వ్యవహరిస్తానని స్పష్టంచేసిన మహేష్.. సరిలేరు నీకెవ్వరు సినిమా చేయాలనే నిర్ణయాన్ని తన కెరీర్ లోనే అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా చెప్పుకొచ్చాడు.