మంచు మనోజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. చాలా కాలంగా భూమా మౌనికారెడ్డితో ఆయన సన్నిహితంగా వుంటున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే సంగతి ఆ కుటుంబాలకు దగ్గరగా ఉన్నవారందరికీ తెలుసు. ఎట్టకేలకు వివాహ బంధంతో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. మంచు మనోజ్కు ఆయన అక్క మంచు లక్ష్మి తన ఇంట్లోనే అన్నీ తానై పెళ్లి జరిపించారు.
మౌనికను వివాహం చేసుకోవడం మంచు మోహన్బాబుకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. పెళ్లికి ఆయన రారని కూడా వార్తలొచ్చాయి. అయితే అలాంటి ప్రచారానికి మోహన్బాబు దంపతులు, మంచు విష్ణు ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే మోహన్బాబు, విష్ణు అందరితో సరదాగా వుండలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వేడి పుట్టిస్తోంది. రకరకాల ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఆ పోస్ట్ వుంది. “లవ్ యూ అక్కా. నువ్వు చేసిన ప్రతిదానికీ కృతజ్ఞతలు. ఏ జన్మ పుణ్యమో నాది. నువ్వు అక్కలా దొరికావు” అని మనోజ్ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది.
సహజంగా వివాహాన్ని తల్లిదండ్రులు దగ్గరుండి చేస్తుంటారు. కానీ మనోజ్, మౌనికారెడ్డి వివాహం విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఇద్దరికీ ఇది రెండో వివాహం. తల్లిదండ్రుల బాధ్యతల్ని కూతురైన మంచు లక్ష్మి నెత్తికెత్తుకుని తన వివాహం జరిపించిందనే నర్మగర్భ వ్యాఖ్యల్ని మనోజ్ పరోక్షంగా పంపారనే ప్రచారం జరుగుతోంది. తనకు పెళ్లి చేసిన ఘనత పూర్తిగా అక్క అయిన లక్ష్మీకే దక్కుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.
లక్ష్మి తనకు అక్కగా పుట్టడం ఏ జన్మ పుణ్యఫలమో లాంటి పెద్దపెద్ద డైలాగ్లను మనోజ్ చెప్పారనే చర్చ నడుస్తోంది. అక్క సరే, మరి మిగిలిన కుటుంబ సభ్యుల గురించి మాట మాత్రమైనా మనోజ్ ప్రస్తావించకపోవడం వెనుక కారణం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది. మొత్తానికి మనోజ్ మనసులోని భావాలు ఎవరికి అర్థం కావాలో వారికి బాగా తెలిసేలా పోస్ట్ పెట్టారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇంటి పేరు మంచు అయినప్పటికీ, ఆయన పెట్టిన పోస్ట్ మాత్రమే వేడి రగిల్చిందని టాలీవుడ్లో టాక్.