తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ కావాలనే చంద్రబాబును పొగిడారో, లేక మరేదైనా ఆశించి అలా చేశారో తెలియదు కానీ, మొత్తానికి అల్లరిపాలయ్యారు. వైసీపీ నుంచి ఈ స్థాయిలో తన ట్రోలింగ్ జరుగుతుందని రజినీకాంత్ అసలు ఊహించి వుండరు. టీడీపీ నుంచి భారీ మొత్తంలో లాభం పొందుతుంటే, ఎన్ని మాటలైనా ఆయన పడొచ్చు. కానీ పైసా లాభం లేకుండా ఉత్తుత్తినే తిట్టించుకోవడం అంటే అజ్ఞానం కిందే లెక్క. బాబుపై పొగడ్తల వెనుక మర్మం ఏంటో రజినీకాంత్కే తెలియాలి.
రజినీకాంత్పై విమర్శలను చంద్రబాబు తప్పు పట్టడం తెలిసిందే. అయితే తమిళ సూపర్ స్టార్కు అత్యంత సన్నిహితుడైన విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో రజినీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబును తనకు మోహన్బాబు పరిచయం చేశారని చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా చెప్పుకునే మోహన్బాబును శత జయంతి వేడుకకు ఎందుకు పిలవలేదో తెలియాల్సి వుంది.
మోహన్బాబు ఆప్తుడైన రజినీకాంత్ను మాత్రం ప్రత్యేకంగా టీడీపీ ఆహ్వానించడం ఎందుకోసమో వారికే తెలియాలి. ఉన్నవీ లేనివీ బాబు క్రెడిట్లో వేసేందుకు రిజనీకాంత్ ప్రయత్నించడంతో ఆయన తీవ్ర విమర్శలకు లోనయ్యారు. తన మిత్రుడిని వైసీపీ నేతలు ఓ రేంజ్లో చెడుగుడు ఆడుతుంటే మోహన్బాబు తనకేమీ పట్టనట్టుగా మౌనాన్ని ఆశ్రయించారు.
రజినీకాంత్ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకోవడం, తనను ఎన్టీఆర్ శత జయంతికి ఆహ్వానించకపోవడంతో మోహన్బాబు నొచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే రజినీకాంత్పై ఘాటు కామెంట్స్పై మోహన్బాబు పట్టించుకోలేదని ఆయన అభిమానులు అంటున్నారు.