మహేష్ తో నాకు చిరాకులున్నాయి, గొడవల్లేవు

సర్కారువారి పాట సినిమాకు సంబంధించి బాగా వైరల్ అయిన టాపిక్ ఒకటుంది. హీరోకి, దర్శకుడికి మధ్య గొడవలు అయ్యాయనేది ఆ టాపిక్. ఒక దశలో పరశురామ్ పై హీరో మహేష్ చాలా అసహనం వ్యక్తం…

సర్కారువారి పాట సినిమాకు సంబంధించి బాగా వైరల్ అయిన టాపిక్ ఒకటుంది. హీరోకి, దర్శకుడికి మధ్య గొడవలు అయ్యాయనేది ఆ టాపిక్. ఒక దశలో పరశురామ్ పై హీరో మహేష్ చాలా అసహనం వ్యక్తం చేశాడంటూ కథనాలు వచ్చాయి. వీటిపై దర్శకుడు పరశురామ్ స్పందించాడు. మహేష్ కు తనకు మధ్య మరీ పెద్ద గొడవలేం జరగలేదంటున్నాడు.

“ఓ పెద్ద సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా చిరాకులుంటాయి. మహేష్ సినిమా నాకు కేక్ వాక్ అని చెబితే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. 3 దశల కరోనా వచ్చింది. సర్కారువారి పాట స్క్రిప్ట్ ను మహేష్ మూడేళ్లు మైండ్ లో మోయాల్సి వచ్చింది. అది చాలా కష్టమైన పని. ఆ ఒత్తిడిలో ఒకట్రెండు ఘటనలు జరిగి ఉండొచ్చు. అంతేతప్ప, ఓవరాల్ గా ఆయన నన్ను ఓ బ్రదర్ లా చూసుకున్నారు.”

ఒక్కసారి స్క్రీన్ ప్లే లాక్ అయిన తర్వత దర్శకుడి పనిలో మహేష్ వేలు పెట్టరని అంటున్న పరశురామ్.. షూటింగ్ టైమ్ లో ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల మహేష్ చిరాకుపడి ఉండొచ్చని అన్నాడు. తామిద్దరి మధ్య చిన్న చిన్న చిరాకులు ఉండొచ్చేమో కానీ, గ్యాప్ వచ్చేంత గొడవలు మాత్రం జరగలేదన్నాడు.

“ప్రాక్టికల్ ఇబ్బందులు కామన్ గా ఉంటాయి. అన్నపూర్ణ లో చేయాల్సిన షూటింగ్ ను ఆర్ఎఫ్సీలో చేయాల్సి వచ్చినప్పుడు చిరాకు వస్తుంది కదా. ఒక చోట చేయాల్సిన సీన్ ను ఓ 20 కిలోమీటర్ల అవతల చేయాల్సి వచ్చినప్పుడు లాంటి సందర్భాల్లో మహేష్ చిరాకు పడి ఉండొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ఇబ్బందులు. ఆ చిరాకులతో సర్కారువారి పాట సినిమాకు ఇబ్బంది కలగలేదు. మహేష్ తో నాకున్న అనుబంధానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మహేష్ ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం దాన్ని ఉపయోగించుకుంటే మనకే మంచిది. ఫైనల్ గా ఆయనకు కూడా హ్యాపీ.”

సర్కారువారి పాట సినిమాకు సంబంధించి చాలా టైటిల్స్ తెరపైకొచ్చాయి. వాటిలో నిజం లేదన్నాడు పరశురామ్. తను ఒకే ఒక్క టైటిల్ అనుకున్నానని, మహేష్ కు ఫోన్ లో ఆ టైటిల్ వినిపించానని, వెంటనే మహేష్ ఓకే చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ చూపిస్తే, దానికి కూడా వెంటనే ఓకె చెప్పారని గుర్తుచేసుకున్నాడు.