ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి ప్రభాస్ మూవీ

అప్పుడెప్పుడో సాహో సినిమా టైమ్ లో జాన్ (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. సాహోతో పాటు పారిస్ లోనే ఆ సినిమా షెడ్యూల్ నడిచింది. అంతే, ఆ తర్వాత సినిమాను పూర్తిగా…

అప్పుడెప్పుడో సాహో సినిమా టైమ్ లో జాన్ (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. సాహోతో పాటు పారిస్ లోనే ఆ సినిమా షెడ్యూల్ నడిచింది. అంతే, ఆ తర్వాత సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశాడు ప్రభాస్. సాహో దెబ్బకు ఇక జాన్ రాదని అంతా అనుకున్నారు కూడా. అలా చాన్నాళ్లుగా ఆగిపోయిన జాన్ సినిమా కొత్త ఏడాదిలో పట్టాలపైకి వస్తోంది. 

ఈ వారంలోనే జాన్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభంకాబోతోంది. టెక్నికల్ గా చెప్పాలంటే జాన్ రెండో షెడ్యూల్ ఈ వారంలో మొదలవుతోందన్నమాట. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. 

సాహో ఫ్లాప్ తర్వాత జాన్ కు చాలా రిపేర్లు జరిగాయి. కథ, స్క్రీన్ ప్లే మార్చడంతో పాటు బడ్జెట్ ను కూడా దాదాపు 40శాతం తగ్గించారు. ఈ మేరకు విదేశాల్లో పెట్టుకోవాల్సిన షెడ్యూల్స్ అన్నీ రద్దు చేశారు.

యూరోప్ వాతావరణాన్ని తలపించేలా ఇక్కడే కొన్ని సెట్స్ వేశారు. అన్నపూర్ణ, రామానాయుడు, రామోజీ ఫిలింసిటీతో పాటు కొన్ని ప్రైవేటు స్థలాల్లో ఈ సెట్స్ వేశారు. వీటిలో అన్నపూర్ణలో వేసిన సెట్ అందుబాటులోకి రావడంతో అక్కడే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

ఇకపై సినిమా మొత్తాన్ని ఈ సెట్స్ లోనే పూర్తిచేస్తామని ప్రకటించారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. ముందుగా అందుబాటులోకి ఏ సెట్ వస్తే ఆ సెట్ లోనే షూటింగ్ కొనసాగిస్తామంటున్నారు.

కంప్లీట్ లవ్-రొమాంటిక్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ ఉంటుందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే వెల్లడించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. సాహో టైపులోనే ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు.

చిరంజీవి సీన్ తెగ నవ్వోచ్చేసింది-ప్రభాస్