కోవిడ్-19 నియమ నిబంధనలు ఉన్న నేపథ్యంలో.. వాటిని అతిక్రమిస్తూ క్లబ్ లో పార్టీ చేసుకున్న పలువురు సెలబ్రిటీలను పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల్లో.. హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే పేరు ప్రముఖంగా వినిపించింది.
కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తూ పార్టీ చేసుకుని అరెస్టైన పలువురిలో సుసానే కూడా ఉందనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఆమె స్పందించారు. తను పోలీసులు అరెస్టు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ విషయం గురించి సోషల్ మీడియా ద్వారా సుసానే తెలియజేశారు. తను తన సన్నిహితులకు సంబంధించిన ఒక పార్టీకి గానూ క్లబ్ కు వెళ్లిన మాట నిజమే అని సుసానే చెప్పారు. అక్కడ తాము తెల్లవారుజుము వరకూ గడిపిన మాట కూడా వాస్తవమే అన్నారు.
తాము క్లబ్ లో ఉండగానే పోలీసులు వచ్చారని.. క్లబ్ నిర్వాహకులతో వారు మాట్లాడినట్టుగా సుసానే తన పోస్టులో పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండున్నర సమయంలో పోలీసులు వచ్చారని, నిర్వాహకులతో మాట్లాడారని సుసానే వివరించింది.
ఆ తర్వాత తమను అక్కడే ఆపారని, దీంతో తెల్లవారుజాము ఆరు గంటల వరకూ తాము క్లబ్ లోనే గడపాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఆరు గంటలకు పోలీసుల అనుమతితో ఎవరిదారిన వారు వెళ్లినట్టుగా పోస్టు పెట్టారు సుసానే. ఇందులో తాము ఎక్కడా అరెస్టు కాలేదని ఆమె వివరణ ఇచ్చారు.