పెళ్లిపై త్రిష రియాక్షన్.. కొత్త చర్చకు దారితీసిన పోస్టు

త్రిష పెళ్లిపై పుకార్లు కొత్తేంకాదు. గడిచిన దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి, ప్రేమ పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు త్రిష ఖండిస్తూ వచ్చింది…

త్రిష పెళ్లిపై పుకార్లు కొత్తేంకాదు. గడిచిన దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి, ప్రేమ పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు త్రిష ఖండిస్తూ వచ్చింది కూడా. అయితే ఈసారి మాత్రం వేరే లెవల్.

త్రిష పెళ్లికి సిద్ధమైందని, ఓ మలయాళీ నిర్మాతను ఆమె పెళ్లాడబోతోందంటూ ప్రచారం మొదలైంది. అది కూడా మామూలుగా లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఓ రేంజ్ లో దీనిపై కథనాలు వచ్చాయి. వాటిని చూస్తే, ఈసారి త్రిష పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అనుకుంటారు ఎవరైనా.

అయితే ఎప్పట్లానే త్రిష తన పెళ్లి పుకార్లను ఖండించింది. కొద్దిసేపటి కిందట ట్విట్టర్ (X)లో రెస్పాండ్ అయిన ఈ బ్యూటీ.. తన పెళ్లిపై వచ్చిన వార్తలన్నీ నిరాధమని కొట్టిపారేసింది. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి.

వాళ్లిద్దరి పైనే త్రిష అభిమానుల అనుమానం

“నువ్వెవరో నీకు తెలుసు. నీ టీమ్ ఏంటో కూడా నీకు తెలుసు. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండు, ఇలాంటి పుకార్లు ఆపు. ఛీర్స్” అంటూ పోస్ట్ పెట్టింది త్రిష. తన సందేశంలో ఎక్కడా పెళ్లి, ప్రేమ లాంటి పదాలు ఉపయోగించనప్పటికీ, తన పెళ్లిపై వచ్చినవన్నీ పుకార్లని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. సరిగ్గా ఇక్కడే త్రిష పోస్టుపై కొత్త చర్చ మొదలైంది.

తను పెళ్లి చేసుకోబోతున్నానంటూ పుకార్లు సృష్టించింది, సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఎవరనే విషయం త్రిషకు బాగా తెలుసని ఆమె అభిమానులు భావిస్తున్నారు. వాళ్లకు తెలియడం కోసమే త్రిష ఇలాంటి సందేశాన్ని పోస్ట్ చేసిందని వాళ్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్, నయనతార పేర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

గతంలో త్రిష పెళ్లిపై విజయ్ ఫ్యాన్స్ లేనిపోని పుకార్లు సృష్టించారు. ఆ విషయాన్ని త్రిష అభిమానులు అప్పట్లో సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఇప్పుడు కూడా మరోసారి విజయ్ ఫ్యాన్స్ ఆ పని చేసి ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం నయనతార పేరు ప్రస్తావిస్తున్నారు.

త్రిషకు పెరుగుతున్న ఇమేజ్ ను దెబ్బతీసేందుకు, ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నయనతారకు చెందిన పీఆర్ టీమ్ ఇలాంటి పనులు చేసి ఉంటుందని త్రిష అభిమానులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు నయనతార తర్వాత ఆప్షన్ త్రిష మాత్రమే. వీళ్లకు మాత్రమే అక్కడ మార్కెట్ ఉంది. సో.. వీళ్లలో ఒక్కర్ని దృష్టిలో పెట్టుకొని, త్రిష ఆ పోస్టు పెట్టి ఉంటుందని కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.