ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించారు. ఇది రెండు పార్ట్లుగా ఆయన తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో జగన్పై సినిమా విడుదల చేయాలనేది వైసీపీతో పాటు దర్శకుడు వర్మ ‘వ్యూహం’ గా కనిపిస్తోంది.
వ్యూహం, అలాగే పార్ట్-2 శపథం పేరుతో వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను వర్మ ఇవాళ ప్రకటించారు. వ్యూహం సినిమాను నవంబర్ 10న, శపథం మూవీని జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఈ మేరకు సినిమాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. పోస్టర్పై ‘కుట్రలకు, ఆలోచనలకు మధ్య’ అని పేర్కొనడం ద్వారా రెండు సినిమాల కథలపై ఆసక్తిని రేకెత్తించారు.
వైఎస్ జగన్ జీవితంలోని ప్రతి ఘటనను రెండు సినిమాల్లో చూపనున్నట్టు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ను జైలుపాలు చేయడం, బయటికి రావడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ఓదార్పు యాత్రలు, 2014 ఎన్నికల్లో అడుగు దూరంలో అధికారానికి దూరం కావడం, ఆ తర్వాత పాదయాత్ర, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, చంద్రబాబు అరెస్ట్ తదితర అంశాలన్నింటిని వ్యూహం పార్ట్-1, 2లలో తెరకెక్కంచనున్నట్టు వర్మ వెల్లడించారు. అయితే సినిమాల్ని ఎలా తెరకెక్కించి వుంటారనే ఆసక్తి నెలకుంది. ఈ సినిమాలు జగన్కు రానున్న ఎన్నికల్లో ఎంతోకొంత ప్రయోజనం కలిగిస్తాయా? లేదా? అనే అంశం చర్చనీయాంశమవుతోంది.
గత ఎన్నికల సందర్భంలో వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా విజయాన్ని సాధించింది. యాత్ర-2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీతనయుల మంచితనం, పోరాట పటిమ, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ప్రదర్శించే ధైర్యసాహసాలను జనంలోకి తీసుకెళ్లి… వైఎస్ జగన్కు సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఫిల్మ్ మేకర్స్గా లక్ష్యంగా కనిపిస్తోంది.