తన ప్రత్యర్థి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తరచూ 'సైకో' అంటూ సంబోధిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. తన కెరీర్ ఆరంభం నుంచి ప్రచారం విషయంలో గోబెల్స్ ను ఫాలో అయ్యే చంద్రబాబు నాయుడు.. తను ఒకటికి వంద సార్లు అంటూ ఉంటే జనాలు అదే నిజం అని నమ్ముతారనే రాజకీయాన్నే అనుసరిస్తూ ఉంటారు. చంద్రబాబు రాజకీయం తన, మన అనే తేడా లేకుండా.. అందరి విషయంలోనూ ఇలానే ఉంటుందనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. అందుకే జగన్ విషయంలో సైకో అనే మాటను ఒకటికి వంద సార్లు వాడుతూనే ఉంటారు.
మరి జగన్ ను అనడం ఏమో కానీ.. చంద్రబాబు చేష్టలు మాత్రం సైకో తరహాలో ఉంటున్నాయి. ఆయన మాటలు, వాలకం, ఊగిపోవడం, రెచ్చగొట్టడం.. ఇవన్నీ చూస్తే.. చంద్రబాబులా వేరే ఎవరైనా మాట్లాడితే వారికి పిచ్చి అని జనాలు ఫిక్సయిపోతారు. అయితే చంద్రబాబుకు మీడియా అండ ఉంది, ఒక కులం లాబీ ఉంది.. అందుకే ఆయన ఏం మాట్లాడినా ఆయనో విజనరీ అని భ్రమింపజేయడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. గోబెల్స్ ప్రచారం ద్వారా.. చంద్రబాబు ఏం మాట్లాడినా దాంట్లో ఒక విజన్ ను చూపించడానికి ఈ వర్గం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది.
ఈ విషయంలో వారు ఫెయిల్ కారు. లెక్కలేనన్ని మార్గాల ద్వారా ఈప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆర్టికల్ పబ్లిష్ అయ్యాకా.. కింద కామెంట్ల రూపంలో రెడ్ల పేరుతో వచ్చే ఫేక్ అకౌంట్లు కూడా చంద్రబాబు ను కాపాడుకోవడానికి పడే పాట్లే! నకిలీ రెడ్లు, నకిలీ నెటిజన్లు.. తయారయ్యి..తెలుగుదేశం అజెండాకు అలిపి లేకుండా ప్రచారం కల్పించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో.. కామెంట్ సెక్షన్ ను పూరించే పచ్చ కూలీలకు కూడా గట్టిగా పని లభించింది. పోనీలే.. కనీసం అలా అయినా కొంతమందికి ఉపాధి దొరుకుతుండవచ్చు.
అసలు సంగతికి వస్తే.. చంద్రబాబు మాట తీరు, చేష్టలను గమనిస్తే.. సుమారుగా ఏడెనిమిదేళ్ల నుంచి చంద్రబాబుకు తన మాట మీదే నియంత్రణ పోయినట్టుగా ఉంది. వేరే ఎవరైనా ఇలా మాట్లాడి ఉంటే.. ఆ మరుసటి రోజే వారి కథ కంచికి చేరేది. అయితే అక్కడ మాట్లాడుతున్నది చంద్రబాబు కాబట్టి.. ఏమైనా మాట్లాడొచ్చు. అడ్డదిడ్డంగా, మతిలేనట్టుగా.. ఎలా మాట్లాడినా ఆయన కాబట్టి ఓకే!
2018లో అమరావతిలో ఒలింపిక్స్ .. అంటూ చంద్రబాబు నాయుడు 2015లో ప్రకటిస్తే.. ఒక్కసారిగా ఆ ప్రకటన విన్న వారికే మతిపోయింది. ఒలింపిక్స్ ఏమిటీ, అమరావతి ఏమిటి.. అసలు 2018లో ఒలింపిక్స్ నిర్వహణ ఉంటుందా? ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ ను నిర్వహిస్తారు.. ఆ లెక్క 2018లో ఒలింపిక్స్ జరిగే అవకాశమే లేదు. అందునా ఒలింపిక్స్ నిర్వహించాలంటే.. కనీసం పదేళ్లకు ముందే బిడ్ లు ఖరారు అవుతాయి. ఏ లెక్కన చూసినా.. అమరావతిలో ఒలింపిక్స్ అనేది మతిలేని వారు మాట్లాడగల మాట! అయితే.. చంద్రబాబు అమరావతిలో 2018లో ఒలింపిక్స్ అనే విషయాన్ని ప్రకటించుకోగలిగారు. అంతే కాదు.. ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే… నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తానంటూ కూడా ఆయన తీర్మాణం చేయగలిగారు!
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో.. చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు అవి! చంద్రబాబుకు ఒలింపిక్స్ అంటే ఏమిటో తెలీదు, నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారో కూడా తెలీదు! అయినా.. రెండింటికీ ముడిపెట్టగలిగిన మహానుభావుడు. అయితే.. అమరావతిలో ఒలింపిక్స్, గెలిచిన వారికి నోబెల్ ప్రైజ్ ను పచ్చమీడియా ఘనంగా అచ్చేసింది. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన వీడియోలు కూడా ఇప్పటికీ ఇంటర్నెట్ లో సజీవంగానే ఉన్నాయి. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదంటూ వాదించిన ఎమ్మెల్యే చంద్రబాబు కన్నా చాలా నయం. అమరావతిలో ఒలింపిక్స్, ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే.. నోబెల్ ప్రైజ్.. అంటూ మాట్లాడినా చంద్రబాబు ఇంకా విజనరీనే!
దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా.. ఇలాంటి ప్రకటన చేసి ఉంటే, అతడినో పిచ్చోడిగా జమ కట్టి జాతీయ స్థాయిలో కామెడీ చేసే వారు. అయితే చంద్రబాబు కోసం ఉన్న లాబీ ఆయన మాట్లాడే అర్థం లేని మాటలను ఎప్పటికప్పుడు కప్పెడుతూ ఉంటుంది. అయితే.. గత కొంతకాలంలో ఆయన మాటలు మరింత దారుణంగా తయారయ్యాయి. తను తిరుపతికి రిగ్గింగ్ చేసుకోవడానికి వెళితే అడ్డుకున్నారంటూ చంద్రబాబు కొన్నాళ్ల కిందట వాపోయారు! రిగ్గింగ్ చేయడానికి వెళుతుంటే అడ్డుకుంటారని చెప్పుకోగల గొప్ప నేత చంద్రబాబు నాయుడు.
ఇలాంటివే కాకుండా.. చంద్రబాబు నాయుడు మాటల నుంచి ఇలాంటి ముత్యాలెన్నో జాలువారాయి. ఈ క్రమంలో సైకిల్ పోవాలి…సైకిల్ పోవాలి.. అంటూ ఆయనే నినదించుకోగలిగారు! కేవలం ప్రత్యర్థుల విషయంలోనే కాదు, జనాలకు మతిభ్రమింపజేసే ప్రకటనలు చేయడమే కాకుండా.. సైకిల్ పోవాలంటూ తన పార్టీ పతనాన్నే తన మాటలతో చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇదీ చంద్రబాబు నాయుడి మానసిక స్థితి.
ఇదేమంత తప్పు పట్టాల్సిన స్థితి కాదు. చంద్రబాబుకు వయసు పెరుగుతుండటంతో ఇలా మాటలపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు. అందులోనూ చంద్రబాబుకు అల్జైమర్స్ అంటూ కాంగ్రెస్ నేతలు గతంలోనే అనే వారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఈ విషయంలో బాహాటమైన ప్రకటనలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అల్జైమర్స్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు గతంలో. మరి ఆయన దగ్గర ఆధారాలు ఏమిటో కానీ, చంద్రబాబు మాటలు మాత్రం ఏదో తేడా అనే అభిప్రాయాన్ని అయితే కలగజేస్తూ ఉంది.
ఇక పుంగనూరులో తన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన తీరు మరింత ఆశ్చర్యాన్ని గొల్పిస్తూ ఉంది. తను 14 సంవత్సరాల సీఎంను దాదాపు అంతే సమయం ప్రధాన ప్రతిపక్ష నేతను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఇలా కార్యకర్తలను పోలీసులపై ఉసిగొల్పి, తరమండి, కొట్టండి అంటూ పిలుపునిస్తూ.. హింసాత్మక చర్యలను కూడా రెచ్చగొట్టిస్తూ ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో ఒక పోలీసుకు రెండు కళ్లూ దెబ్బతిన్నాయి.. జీవితాంతం అతడు అంధుడిగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వార్త ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రక్షణగా వెళ్లిన పోలీసులకు పట్టాల్సిన గతా ఇది? పట్టపగలు, బాహాటంగా, సమూహాన్ని రెచ్చగొడుతూ.. కొట్టండి, తరమండి.. అంటూ వ్యాఖ్యానించడానికి మించిన శాడిజం ఏముంది? ఇంతకు మించిన సైకో ఎవరుంటారు?
ఒకవేళ.. ఇలాంటి మాటలే మరొకరు మాట్లాడి ఉంటే? కొట్టండి, తరమండి అంటూ జగన్ గనుక కార్యకర్తలను అలా రెచ్చగొట్టి ఉంటే, దాడులకు పాల్పడండి అంటూ సమూహాన్ని రెచ్చగొట్టి పోలీసులపైకి, ప్రత్యర్థులపైకి పంపి ఉంటే.. అప్పుడు చంద్రబాబు స్పందన ఎలా ఉండేది? జస్ట్ పుంగనూరులో చంద్రబాబు ప్లేస్ లో జగన్ ను పెట్టి చూసి ఉంటే.. దాన్ని పచ్చమీడియా ఎంత చేసేది? ఇక జన్మజన్మలకైనా.. దాన్ని మరిచిపోవడం కాదు కదా, ఇక అదొక్కటే వారి రాజకీయ జీవితానికి చరమాంకం అయ్యేది!
అయితే కేవలం మీడియాను అడ్డం పెట్టుకుని, గోబెల్స్ వ్యూహాలను అడ్డం పెట్టుకుని, ఎంతైనా వెచ్చించి.. అన్ని చోట్లా విత్తనాలను చల్లుకుని.. తను ఏం చేసినా చెల్లుబాటు అయ్యే స్థితికి చంద్రబాబు నాయుడు చేరుకున్నాడు. మతిస్థిమితం లేనట్టుగా మాట్లాడినా, రిగ్గింగ్ చేసుకోవడానికి వెళ్లాను, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాను.. అంటూ ఇష్టానుసారం మాట్లాడినా చంద్రబాబు కాబట్టి.. ఆయన విజనరీ. ఇది ఆయన కులం చెబుతుంది. ఇది ఆయన విత్తనాలు చల్లి పెంచుకున్న వ్యవస్థలు చెబుతాయి. ఆ వ్యవస్థల ద్వారా ప్రభావితం అయిన అమాయకులూ చెబుతారు! ఆయనను భుజానికెత్తుకుని మోస్తున్న జనసున్నాలూ చెబుతారు!
అయితే నిజాలను నిర్భయంగా మాట్లాడుకుంటే.. చంద్రబాబులా మరొకరు మాట్లాడితే అతడికి పిచ్చి అంటారు. చంద్రబాబులా రెచ్చగొడితే సైకో అంటారు. చంద్రబాబులా నోటికొచ్చిందంతా చెబుతూ పోతే మతిభ్రమించింది అంటారు. వయసు వల్ల మెదడుకు అనారోగ్యం చేసి.. ఇంట్లో పెట్టి గదికి తలుపులు వేయాల్సిన వ్యక్తిని రోడ్డు మీదకు వదిలి అతడిని ప్రధాన ప్రతిపక్ష నేత అంటూ ప్రజల మీద ప్రయోగించడం అంటారు!
అడ్డగోలుగా మాట్లాడుతూ.. హైదరాబాద్ తనే కట్టానని చెప్పుకుంటూ, అమరావతిలో చిన్నపాటి వర్షానికి కారే అసెంబ్లీనికి వెయ్యి కోట్ల రూపాయలకు కానుకగా మిగిల్చి వెళ్లిన చంద్రబాబు నాయుడు ఏవో ఇడ్లీ పాత్రల గ్రాఫిక్స్ చూపిస్తే.. అదే విజనరీ అనుకుంటే, అంతకు మించిన దౌర్భాగ్యమూ లేదు. చంద్రబాబు లా మాట్లాడితే తమ దేశంలో జైల్లో అయినా పెడతారు, పిచ్చాసుపత్రిలో అయినా పెడతారంటూ వెనుకటికి ఒక విదేశీ నేత ప్రకటించాడు. అయితే.. ఏపీలో మాత్రం చంద్రబాబు తనలా మాట్లాడుతూ.. ఇంకా దర్జాగా బయటే తిరుగుతున్నారు! అందుకే ఏపీకి ఈ గతి!