కొందరు టీడీపీ నేతలకు టికెట్లపై చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారాన్ని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున చేస్తోంది. ఎల్లో మీడియా ప్రకటిస్తున్నట్టుగా టికెట్లు కన్ఫార్మ్ అయినట్టు ప్రచారం అవుతున్న కొందరి పేర్లు వింటే.. ఇలాగైతే టీడీపీకి భవిష్యత్ వుంటుందా? అనే అనుమానం సొంత పార్టీ శ్రేణుల్లోనే కలుగుతోంది.
చంద్రబాబు మొహమాటానికి పోయి, చేజేతులా టీడీపీకి రాజకీయ సమాధి కడుతున్నారనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకుంది. బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ నినాదంతో ప్రజల ఆదరణ పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ కావడం, అనారోగ్య సమస్యతో మధ్యంతర బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. న్యాయ స్థానం షరతులు విధించడంతో రాజకీయ కార్యకలాపాల జోలికి చంద్రబాబు వెళ్లలేదు.
అయితే ఇంట్లోనే వుంటూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖంగా పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత పేరు వినిపిస్తోంది. అలాగే ఇటీవల నంద్యాల నుంచి మాజీ మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ పేరును ఖరారు చేసినట్టు ఎల్లో పత్రికల్లోనే వార్త వచ్చింది. టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఇవ్వకూడదు? అనేది ఆ పార్టీ అంతర్గత విషయం. ఎందుకంటే బలమైన అభ్యర్థులను నిలిపితేనే విజయం వరిస్తుంది.
ఇంత వరకూ టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అభ్యర్థులను పరిశీలిస్తే… టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేదనే టాక్ వినిపిస్తోంది. పాయకరావుపేట ఒక్క నియోజకవర్గం చాలు… చంద్రబాబు ఎంపిక ఎంత దరిద్రంగా వుందో అర్థం చేసుకోడానికి. ఇదే పాయకరావుపేటలో గొల్ల బాబురావుపై వ్యతిరేకత ఉందనే కారణంతో ప్రత్యామ్నాయంగా మరొకరిని సీఎం జగన్ రెడీ చేసుకున్నారు. బాబు మాత్రం ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, తన కుమారుడికి ఇష్టమైన నాయకులకు టికెట్లు ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
పాయకరావుపేటలో వంగలపూడి అనిత అరాచకాలు అన్నీఇన్నీ కావని, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని జనసేన, టీడీపీ నాయకులే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అయితే వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనిత ఇష్టానుసారం నోరు పారేసుకుంటుండడంతో ఆమె పద్ధతి లోకేశ్కు బాగా నచ్చినట్టుంది. అందుకే అనితకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు లేకున్నా, ఆయన తనయుడి ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పాయకరావుపేట నియోజక వర్గం మరోసారి వైసీపీ ఖాతాలో పడ్డట్టే.
కేవలం సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడం వల్లే ఆ పార్టీ మరోసారి చావు దెబ్బ తినేపరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు నంద్యాల విషయానికి వస్తే, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి క్షేత్రస్థాయిలో బలం వుంది. అయితే ఆయన్ను కాదని, ఓడిపోతారని తెలిసి కూడా ఫరూక్కే టికెట్ ఇవ్వడానికి టీడీపీ నిర్ణయించింది. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నంద్యాల పక్క నియోజకవర్గం ఆళ్లగడ్డలో కూడా ఇదే పరిస్థితి. టీడీపీ సర్వేలన్నీ కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇప్పటికే ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియను పక్కన పెట్టడానికి తండ్రీతనయులైన చంద్రబాబు, లోకేశ్కు మొహమాటం. తాడికొండ నియోజకవర్గానికి వస్తే… ఉండవల్లి శ్రీదేవి వద్ద బాగా డబ్బు ఉందని ఆమె వైపు చంద్రబాబు, లోకేశ్ మొగ్గు చూపుతున్నారు. కానీ టీడీపీ కేడర్ ఆమెకు వ్యతిరేకంగా వుంది. రాజధానిని అక్కడి నుంచి తీసేసినా వైసీపీకి రాజకీయంగా అనుకూలిస్తోందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. మరోవైపు చంద్రబాబు, లోకేశ్ బలహీనమైన అభ్యర్థులను పక్కన పెట్టడానికి ధైర్యం చేయకపోవడం కూడా టీడీపీకి రాజకీయంగా నష్టం తెస్తోంది. వంగలపూడి అనితే ఇందుకు నిదర్శనమని టీడీపీ నేతలు చెబుతున్నారంటే, అభ్యర్థుల ఎంపికపై ఎంత బలహీనంగా కసరత్తు జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇదే రకంగా అత్యంత బలహీన అభ్యర్థులకు బాబు ష్యూరిటీ ఇస్తే మాత్రం … టీడీపీ భవిష్యత్కు గ్యారెంటీ ఇచ్చే వాళ్లెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.