తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ను తక్కువ అంచనా వేయడం వల్లే నేడు చంద్రబాబు జైలుపాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా జగన్ తక్కువగా మాట్లాడ్తారు. చేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్వభావమే టీడీపీ చావుకొచ్చింది. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేమని ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలకు అర్థమైంది. జగన్తో ఒంటరిగా తలపడడానికి భయంతో వణికిపోతున్నారు.
టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ వేదికలపై వైఎస్ జగన్ను ఎన్నెన్నో తిడుతుంటారు. “ఏయ్ జగన్ నీ అంతు చూస్తాం. నిన్ను అది చేస్తాం, ఇది చేస్తామని” హెచ్చరించడం చూశాం. అలాగే చంద్రబాబు పదేపదే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి…”మీ నాన్న నాపై ఎన్నో కేసులు పెట్టి, చివరికి ఏమీ చేయలేకపోయారు. ఇక నువ్వెంత సైకో జగన్. ఏం పీకుతావో పీక్కో” అని రెచ్చగొట్టారు. ఇదే రకంగా బాబు తనయుడు లోకేశ్ కూడా నోరు జారారు.
చంద్రబాబు, నారా లోకేశ్ బహిరంగ సభల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ జగన్పై అవాకులు చెవాకులు పేలడం సరదా అనుకున్నారు. కానీ వారి ప్రతి రెచ్చగొట్టే కామెంట్ను జగన్ సీరియస్గా తీసుకున్నారు. అలాగని మనసులో అగ్ని పర్వతంలా రగులుతున్న మంటను ఎప్పుడూ జగన్ బయటికి ప్రదర్శించలేదు.
చంద్రబాబును ఎలా పీకొచ్చో కొన్నేళ్లుగా సీఎం జగన్ సమగ్ర అధ్యయనం చేశారు. స్కిల్ స్కామ్లో పక్కా ఆధారాలతో రెడీ చేయించారు. నంద్యాలలో జనం మధ్య ఉన్నప్పటికీ ఎలాంటి అలజడి లేకుండానే అరెస్ట్ చేయించి, ఏసీబీ కోర్టులో హాజరు పరిచేలా చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంత వరకూ ఏం పీకుతారో పీక్కోండని పరాక్రమాలు చేసిన వాళ్లంతా.. నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు.
ఇవాళ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… జగన్ను రెచ్చగొట్టకండ్రా బాబూ, ఏం పీకుతారో పీక్కోండని చంద్రబాబు అనడం వల్లే నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుండాల్సి వచ్చిందని సున్నితంగా హెచ్చరించారు. లోకేశ్ నోరు జారుతున్నారని, కాస్త ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేసి, ఇంకా తమను కాపాడేందుకు వ్యవస్థలున్నాయనే భ్రమలో టీడీపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. బాబు అరెస్ట్తో వ్యవస్థల్లో తమ పట్టు పోయిందనే జ్ఞానోదయాన్ని సీఎం జగన్ కల్పించారు. ఇంతకాలం దివంగత వైఎస్సార్ను అసాధ్యుడని ప్రతిపక్షాలు అనుకుంటూ వచ్చాయి. కానీ ఇటీవలి పరిణామాలు వైఎస్సార్ కంటే జగన్ వందరెట్లు అసాధ్యుడనే పేరు తెచ్చాయి.
చంద్రబాబు, పవన్కల్యాణ్, నారా లోకేశ్ బహిరంగ సభల్లో జగన్ను ఉద్దేశించి నీచంగా తిట్టడం తెలిసిందే. సైకో జగన్, నువ్వెంత నీ బతుకెంత అని చులకనగా మాట్లాడుతున్నారు. అయినా జగన్ మాత్రం నోరు మెదపడం లేదు. మహా అయితే పవన్ను దత్త పుత్రుడని, చంద్రబాబు అండ్ కోను దుష్ట చతుష్టయంగా అభివర్ణిస్తున్నారు. కానీ తన చేతల ద్వారా వాళ్లలో భయాన్ని క్రియేట్ చేశారు. ఎంతగా అంటే పవన్కల్యాణ్ ఇంత వరకూ తాను ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించడానికి కూడా ధైర్యం చాలనంతగా.
చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ కేవలం జనం ఎదుట రంకెలు వేయాల్సిందే. కానీ జగన్ మొండివాడు. తాను ఏదైనా అనుకుంటే సాధించే వరకూ నిద్రపోరు. ఈ వైఖరే ప్రతిపక్ష నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.