అధికారంలోకి వస్తే ప్రత్యర్థుల్ని వీధుల్లో ఊరేగిస్తానని ప్రగల్భాలు పలికిన లోకేశ్ తానే ఢిల్లీ వీధుల్లో దిక్కు తెలియకుండా తిరుగుతున్నాడు. అసలు లోకేశ్ ఢిల్లీ వెళ్లిన పని జాతీయ మీడియాలో బాబు అరెస్ట్ గురించి ఫోకస్ చేయడం. అయితే అది పెద్దగా జరగలేదు. ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా పెద్దగా పేలలేదు. కారణం ఏమంటే చంద్రబాబుకే ఢిల్లీలో పెద్ద విలువ లేదు. మొన్న ఆయన ఢిల్లీకి వెళితేనే ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆయన అరెస్ట్ గురించి ఎవరు పట్టించుకుంటారు? పైగా లోకేశ్ ఎవరో ఢిల్లీలో తెలియదు. ఢిల్లీ మీడియా లోకేశ్కి తెలియదు.
అసలు లోకేశ్కి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గోడమీద పిల్లిలా వుంటూ, ఎవరి పట్లా నమ్మకంగా వుండకుండా అందరికీ దూరమయ్యాడు. ఎవరికీ చంద్రబాబు అవసరం లేదు. కరివేపాకు రాజకీయాలు జీవితమంతా ఆచరించి చివరికి బాబు కరివేపాకుగా మిగిలిపోయాడు.
మనకిలాగే జాతీయ మీడియా రెండుగా చీలిపోయింది. బీజేపీ అనుకూల, ప్రతికూల మీడియా. బీజేపీ మీడియాకి లోకేశ్ గోల అవసరం లేదు. బాబు అరెస్ట్ వెనుక హస్తం బీజేపీదే కాబట్టి మిగిలింది కాంగ్రెస్ మీడియా, వాళ్లకి బాబు అవసరం లేదు, నమ్మరు కూడా. పైగా బాబు అవినీతిపైన ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆయన నిప్పు అంటే కాంగ్రెస్ మీడియా పకపక నవ్వుతుంది.
ప్రధాన పక్షాలు కాకుండా ఎంతోకొంత తటస్థంగా వుండే కమ్యూనిస్టు పార్టీలు, ఆప్, తృణముల్ కూడా బాబుకి మొహం చాటేశాయి. గతంలో ఏనాడూ చంద్రబాబుకి ఈ గతి లేదు. తెలివి తన ఒక్కడి సొంతం అనుకున్నాడు. ఇప్పుడు తనని మించిన వాళ్లు వచ్చారు.
ఎర్ర డైరీలో పేర్లు రాస్తున్నానని కోతలు కోసిన లోకేశ్కి తెలియని విషయం ఏమంటే చంద్రబాబు పేరు చాలా మంది రాసుకున్నారు. లోకేశ్కి మిగిలిన ఆశ సీఎం రమేశ్, సుజనాచౌదరి. వాళ్లు వ్యాపారులే తప్ప నాయకులు కాదు. మోదీకి సాగిలపడే బ్యాచ్ తప్ప, సలహాలు చెప్పే సీన్ లేదు. లోకేశ్ కోసం లాబీయింగ్ చేసే అవసరం వాళ్లకి లేదు. తేడా వస్తే టీడీపీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పగలరు.
పెద్ద దిక్కు వెంకయ్యనాయుడు రిటైర్డ్ అయ్యారు. ఆయన మాట చెల్లదు. రామోజీరావుతో చెప్పిద్దామంటే ఆయనకే అడుగు ఊడిపోయి అరెస్ట్కు దగ్గరగా వున్నారు. లోకేశ్ని కూడా అరెస్ట్ చేస్తే ఢిల్లీలో దుకాణం బంద్. ఆంధ్రాలో బాలకృష్ణ మాట్లాడితే అర్థం కాదు. బ్రాహ్మణికి మాట్లాడ్డం రాదు. ఆర్కే కొత్త పలుకులో కత్తులు నూరితే, పళ్లు కొరికితే పనులు జరుగుతాయా?
జగన్ సినిమా స్పష్టంగా కనపడాలంటే 3D అద్దాలు కావాలి. చంద్రబాబుకి ఇవ్వాల్సింది వేడి నీళ్లు కాదు, 3D గ్లాసెస్!