జనసేనానినిలో అభద్రతాభావం

ఒక పార్టీకి అధినేతగా ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన నాయకుడు తానే పిరికిగా వ్యవహరించకూడదు. అది పార్టీలోని నాయకులకు, కేడర్ కు తప్పుడు సంకేతాలు…

ఒక పార్టీకి అధినేతగా ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన నాయకుడు తానే పిరికిగా వ్యవహరించకూడదు. అది పార్టీలోని నాయకులకు, కేడర్ కు తప్పుడు సంకేతాలు పంపుతుంది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇదంతా తెలియదా? 

ఎన్నికల రణరంగంలో వెనుకంజ వేస్తే భవిష్యత్‌ రాజకీయాలపై ప్రభావం పడుతుంది. ఈ విషయం సేనానికి తెలియంది కాదు. అయినా ఓడిపోతాననే అభద్రతాభావం ఆయన్ను వెంటాడుతోంది. అందుకే ఇప్పటివరకు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోలేకపోయాడు. 

పవన్‌ చరిష్మాకు అసలైన పరీక్ష ఇది. ‘జగన్‌రెడ్డీ నువ్వేంత.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తా. వైఎస్సార్‌సీపీ మంత్రులూ మీ తాట తీస్తా. ఎమ్మెల్యేలూ మీ అంతు చూస్తా’ మైకు దొరికితే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్‌లు ఇవి. ఇతడిని పెద్ద ధైర్యవంతుడిగా సేన నాయకులు, అభిమానులు ఊహించుకుంటుంటారు. 

ఒక పార్టీ అధినేత అయిన సేనాని ఇంత వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భయపడి ఎక్కడి నుంచి బరిలో ఉంటే ఈజీగా గెలుస్తానో సర్వేలు చేయించుకుంటున్నాడు. దీనిని బట్టి అతను ఎంత పిరికివాడో స్పష్టమవుతోంది. 2014లో ఎన్నికల్లో పవన్‌ పార్టీ పోటీ చేయలేదు. 2019లో నేతలు వద్దంటున్నా వినకుండా గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు. 

ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని సేఫ్‌ నియోజకవర్గం వెతుక్కుంటున్నాడు సేనాని. పార్టీ పెట్టి పది సంవత్సరాలైంది. కనీసం 20 శాతం నియోజకవర్గాల్లో అయినా బలోపేతం చేసి ఉంటే ఎక్కడి నుంచైనా బరిలో దిగి గెలుస్తాననే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు కాళ్ల దగ్గర సేనను తాకట్టు పెట్టడంతో ఇప్పుడు సీటు కోసం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈసారి కూడా భీమవరమే అన్నారు. అతీగతీ లేదు. పిఠాపురం పేరు వినిపించింది. ఓడిపోతానని మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో సేనాని నిమగ్నమయ్యారు. ఒకానొక సందర్భంలో తిరుపతి నుంచి పోటీ చేయాలని భావించాడు. మళ్లీ వెనక్కి తగ్గాడు. 

2019 నుంచి ఏదైనా ఒక ప్రాంతంపై గురి పెట్టి ఉంటే మొదటి జాబితాలోనే తన పేరు పెట్టుకునేవాడు. కానీ వీకెండ్‌ రాజకీయాలకే పరిమితం కావడంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానంపై ఆధారపడాల్సిన స్థాయికి పడిపోయాడు. వైఎస్సార్‌సీపీ అధినేతకు పులివెందుల ఉంది.

ఇక చంద్రబాబు, లోకేశ్‌ మొదటి జాబితాలోనే తాము ఎక్కడి నుంచి పోటీ చేస్తామో చెప్పేశారు. చివరికి సినీ నటుడు బాలకృష్ణ అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. నేను బలవంతుడినని, జగన్‌ కోటలు బద్ధలు కొడతానని చెప్పుకొనే పవన్‌ మాత్రం సీటు ఊసే ఎత్తలేదు. 

వాస్తవానికి సేనాని గెలవడం నారా తండ్రీకొడుకులకు ఇష్టం లేదు. కాపుల ఓట్ల కోసం అతడిని వాడుకుంటున్నారంతే. పవన్‌ పిరికివాడు. అందుకే నియోజకవర్గం విషయంలో స్పష్టత లేదని తెలుగు తమ్ముళ్ల చేత ప్రచారం చేయిస్తున్నారు. దీంతో జనసేన శ్రేణులు డీలా పడిపోయాయి.