Advertisement

Advertisement


Home > Politics - Analysis

వెంకయ్య - భాజపా..తేదేపా..భాజపా

వెంకయ్య - భాజపా..తేదేపా..భాజపా

కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా భారతీయ జనతాపార్టీలో హవా మాత్రం వెంకయ్య నాయుడుదే. కేవలం అవిభక్త తెలుగు రాష్ట్రంలోనే కాదు అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల్లో కూడా ఆయనే చక్రం తిప్పారు. జనసంఘ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం వాజపేయి, అద్వానీల అనుచరుడిగా దక్షిణాదిన చక్రం తిప్పారు. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత భాజపా ఆయనతో చేతులు కలపడానికి, ఎన్టీఆర్ ను గద్దె దింపినపుడు బెంగళూరులో క్యాంప్ నిర్వహణకు అన్నింటికీ వెంకయ్య సహకరించారు. పేరుకు భాజపా అయినా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా ఆయన అండదండలు అందించారన్నది వాస్తవం. 

అంతే కాదు జనసంఘ్ గా వున్నపుడు ఆంధ్రలో వున్న చాలా మంది సీనియర్ లీడర్లు వారంతట వారు తప్పుకునేలా చేయడంలో వెంకయ్య హస్తం వుందనే వ్యాఖ్యానాలు వున్నాయి. తెలుగుదేశం పోకడలు, ఆ పార్టీతో వెంకయ్య బంధాలు నచ్చని భాజపా..జనసంఘ్.. ఆర్సెస్సెస్ .. విశ్వహిందూ పరిషత్ జనాలు ఎవ్వరికీ వెంకయ్య అస్సలు నచ్చేవారు కాదు. కానీ చేసేదేమీ లేదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం అండదండలు ఆయనకు వుండేవి కనుక ఏమీ చేయలేకపోయారు.

ఒక సమయంలో వెంకయ్య కు చంద్రబాబు కు కూడా చెడింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వెంకయ్య నాయుడు తన ఓటమికి చంద్రబాబు వెన్నుపోటే కారణమని విమర్శించారు. కానీ తరువాత తరువాత మళ్లీ కలిసిపోయారు. 

కేంద్రంలో తనకు వున్న అధికారం, పలుకుబడితో వెంకయ్య నాయుడు తన కుమారుడి వ్యాపార విస్తరణకు చాలా కృషి చేసారనే విమర్శలు కూడా వున్నాయి. పైకి ఎవ్వరూ మాట్లాడకపోయినా, పలు డీలర్ షిప్ లు, ఏజెన్సీలు ఆయన కుటుంబానికి దక్కడంలో కానీ, ఆయన కుమార్తె స్వర్ణభారతి ట్రస్ట్ కు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు అందడం వెనుక కానీ వెంకయ్య కృషి వుందని కూడా రాజకీయ ప్రత్యర్ధులు తమ ఆంతరింగిక సంభాషణల్లో అంటూ వుంటారు.

భాజపాలో మోడీ శకం ప్రారంభమైన తరువాత వెంకయ్య ప్రాభవం తగ్గడం మొదలైంది. . నిజానికి అద్వానీకి స్ట్రాంగ్ సపోర్టర్ అయినా వెంకయ్య తన చాతుర్యంతో మోడీకి కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు చేసారు. నిజానికి మోడీని ఎలాగో అలా ఒప్పించి, తెలుగుదేశంతో 2014లో జత కలిపింది వెంకయ్య నాయుడే అని అంటారు. గతంలో కీలకమైన గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆయన మోడీ హయాంలో ముందుగా పట్టణాభివృద్ది శాఖకు, ఆ తరువాత సమాచార శాఖకు మారారు. 

తెలుగుదేశం-భాజపా బంధాలు క్షీణించడం ప్రారంభమైన తరువాత ఆయనను యాక్టివ్ పాలిటిక్స్ లోంచి తప్పించి, ఉపరాష్ట్రపతిని చేసారు. నిజానికి అది ఉన్నత గౌరవం. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం వెంకయ్యను యాక్టివ్ పాలిటిక్స్ లోంచి తప్పించారన్న ఆక్రోశాన్ని తన వార్తల్లో వెళ్లకక్కేది. ఆ తరువాత మోడీ-బాబు బంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక ఆ తరువాత వెంకయ్య నాయుడు యాక్టివ్ పాలిటిక్స్ కూ దూరమయ్యారు. 

వెంకయ్యను రాష్ట్రపతి చేస్తారని తెలుగునాట ఓ వర్గం, ఓ వర్గం మీడియా బలంగా ఆశలు పెట్టుకున్నాయి. చివరి వరకు ఆ దిశగా వార్తలు వండి వార్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?