అచ్చెన్న వర్సెస్ ధర్మాన వన్ సైడ్ వార్!

ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు కుటుంబాలు రెండు పార్టీల నుండి దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. కింజరాపు కుటుంబం ధర్మాన కుటుంబం వేరు పార్టీలలో ఉంటూ రాజకీయంగా సవాల్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా…

ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు కుటుంబాలు రెండు పార్టీల నుండి దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. కింజరాపు కుటుంబం ధర్మాన కుటుంబం వేరు పార్టీలలో ఉంటూ రాజకీయంగా సవాల్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా అదే జరిగింది. కింజరాపు ఫ్యామిలీ నుంచి అచ్చేన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా, అబ్బాయి రామ్మోహన్ ఎంపీగా పోటీ చేశారు.

ధర్మాన కుటుంబం నుంచి ప్రసాదరావు, శ్రీకాకుళం నుంచి క్రిష్ణ దాస్ నరసన్నపేట నుంచి పోటీలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో పది సీట్లకు గత ఎన్నికల్లో ఎనిమిది సాధించిన వైసీపీ ఈసారి కూడా అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తామని అంటోంది. ఈసారి అట్టు తిరగబడిందని వార్ వన్ సైడ్ అని టీడీపీ అంటోంది.

తమకు ఉన్న సర్వేలు చూస్తే మొత్తం సీట్లు మేమే గెలుస్తామని అచ్చెన్నాయుడు అంటూంటే మా సర్వేలే నిజం వైసీపీ మరోసారి విజయఢంకా మోగిస్తుందని ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఇద్దరూ రాజకీయంగా వూహకర్తలే. ఇద్దరూ జిల్లా రాజకీయాలను కనుసన్నలలో నడిపిస్తున్న వారే.

దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి విజయం ఎవరికి మెజారిటీ సీట్లు అన్న చర్చకు తెర లేచింది. వైసీపీకి పలాస, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ,  పాతపట్నంలలో గెలుపు ఉంటుందని వైసీపీ ధీమాగా ఉంటే టీడీపీ లెక్కలు చూస్తే టెక్కలి ఆముదాలవలస, ఎచ్చెర్ల, రాజాం, పలాసా, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్చాపురం లలో తమదే విజయం అన్నట్లుగా ఉంది.

ఈ రెండు పార్టీల అంచనాలలో ఎవరిది కరెక్ట్ అన్నది జూన్ 4న వచ్చే ఫలితమే క్లారిటీ ఇవ్వాలి. అయితే శ్రీకాకుళంలో నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. చెరి సగం సీట్లు రావచ్చు అన్నది ఒక సాధారణ అంచనాగా ఉంది.