అధికారులే బలి పశువులా?

సింహాచలంలో ఏమి జరిగినా మంత్రుల నుంచి ఆదేశాల ప్రకారమే అంతా చేశారని ఒక వైపు చెబుతున్నారు.

సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘోర కలికి ఏడుగురు బలి అయ్యారు. అప్పటికప్పుడు కట్టిన గోడ ఫ్లెక్సీ మాదిరిగా ఊగిపోయి అమాయక భక్తులు ప్రాణాలు తీసింది. అయితే దీని మీద టీడీపీ కూటమి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది.

ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ నాయకత్వం వహిస్తున్న ఈ త్రిసభ్య కమిటీ విచారణలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. హడావుడిగా గోడ నిర్మించమన్నారంటూ కమిటీ ముందు పలువురు చెప్పారు. ప్రధానంగా చూస్తే దేవాదాయ శాఖ, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో పాటు గోడను కట్టిన కాంట్రాక్టరు కూడా ఈ ప్రమాదానికి అసలైన కారణం అని అంటున్నారు. అయితే అధికారులు తొందర పెడితే తాను కట్టాను అని కాంట్రాక్టర్ చెబుతున్నారు.

ఇలా అధికారుల మీదనే తప్పు అంతా తోస్తున్నారు. అయితే అయిదుగురు మంత్రులతో హైలెవెల్ మీటింగులు అనేక సార్లు చందనోత్సవం మీద జరిగాయి. అలాంటపుడు హైలెవెల్ మంత్రుల కమిటీ ముందు ఇంత పెద్ద గోడ నిర్మాణం గురించి చూచాయగా అయినా ప్రస్తావనకు రాలేదా అని అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సింహాచలంలో ఏమి జరిగినా మంత్రుల నుంచి ఆదేశాల ప్రకారమే అంతా చేశారని ఒక వైపు చెబుతున్నారు. అలాంటిది పేక మేడలా కూలిపోయే గోడ కట్టడం అది కూడా చివరి నిముషంలో హడావుడి పెట్టి మరీ కట్టించిన విషయం చిన్నది ఎలా అవుతుంది అని అంటున్నారు. మంత్రుల దాకా ఈ విషయం వెళ్ళిందా వెళ్తే ఎలాంటి టెండర్లు లేకుండా సరైన సమయం ఇవ్వకుండా నాణ్యతా లోపంతో ఈ గోడను అప్పటికప్పుడు నిర్మించమని ఎవరు సలహా ఇచ్చారు అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు.

అధికారులదే తప్పు అని అసలైన వారిని వదిలేస్తున్నారు అని మృతుల కుటుంబాలు బాధితులు అంటున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగి ఏడుగురు చనిపోయిన విషయాన్ని ఏవరూ తేలికగా తీసుకోకూడదని బాధితులు కోరుతున్నారు. గోడ కట్టమని ఒత్తిడి చేసింది ఎవరు హడావుడి పెట్టించి మరీ నాణ్యత లేకుండా దానిని మృత్యువు మార్గంగా మార్చింది ఎవరు అసలు సూత్రధారి ఎవరు అన్నది వెలికి తీసి శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

సింహాచలంలో చందనోత్సవం అతి పెద్దదిగా ఉంటుంది. ఆ సమయంలో ఈవే సెలవు మీద వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూడాలన్న దాని మీద కూడా అంతా తర్కించుకుంటున్నారు. అందరి బాధ్యతారాహిత్యం కొంప ముంచిందని అంటున్నారు.

2 Replies to “అధికారులే బలి పశువులా?”

Comments are closed.