చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పడం గమనార్హం. కేవలం నిరుద్యోగ భృతితో సరిపెట్టనున్నారన్న మాట. నిరుద్యోగ భృతి ఇస్తానంటే, ఉద్యోగాలు ఇవ్వరనే సంకేతాలు పంపినట్టు అవుతుందని భావించిన చంద్రబాబు…అవి కూడా ఇస్తానని మొక్కుబడినా చెప్పడం గమనార్హం. చంద్రబాబును మరోసారి ఎన్నుకుంటే ఆయన సుపుత్రుడు లోకేశ్కు మాత్రమే మంత్రి పదవి అనే ఉద్యోగం వస్తుందని తేలిపోయింది.
2014లో బాబొస్తే… జాబు అనే నినాదం యువతలో బాగా ప్రభావం చూపింది. చంద్రబాబును గెలిపించుకుంటే తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. జాబు రావాలంటే బాబు రావాలనే టీడీపీ ప్రచారాన్ని నిరుద్యోగులు విశ్వసించారు. చివరికి చంద్రబాబు అధికారంలోకి వచ్చారే తప్ప, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ….అది కూడా పార్టీకి చెందిన వారికి ఇచ్చి మమ అనిపించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తానని నమ్మబలికారు. ఉద్యోగాలు కూడా ఇస్తానని ఆయన చెప్పడం గమనార్హం. కానీ నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన గురించి ఎంతకైనా మంచిదని రెండు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకన్న అభిప్రాయం వుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న దృష్ట్యా ఉద్యోగాల భర్తీ భారంతో కూడుకున్న వ్యవహారం.
అందులోనూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలను బలంగా అమలు చేసిన పాలకుడిగా చంద్రబాబుకు పేరుంది. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం అమాయకత్వమే. బాబు సీఎం అయితే బాగుపడే ఏకైక నిరుద్యోగి లోకేశ్ మాత్రమే. కనీసం ఎమ్మెల్యే కూడా కాని లోకేశ్కు మంత్రి పదవి కట్టబెట్టిన వైనం గురించి అందరికీ తెలిసిందే.
కేవలం లోకేశ్కు మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీ కట్టబెట్టారనే సంగతి తెలిసిందే. ఉద్యోగాలిస్తా అనే హామీని లోకేశ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా…హామీని నిలబెట్టుకున్నానని చంద్రబాబుకు చెప్పే అవకాశం ఉంటుంది. చంద్రబాబు మాయ మాటల్ని నమ్మాలా? వద్దా? అనేది నిరుద్యోగుల విచక్షణపై ఆధారపడి వుంది.