మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్కు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాక్ ఇచ్చారు. ఇటు బావ, అటు అల్లుడు అయిన లోకేశ్లను పక్కకు తోసి ఇక తాను వస్తున్నా అని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని బాలయ్య చేసిన కామెంట్స్ సొంత పార్టీ నేతలను ఆశ్చర్యపరిచాయి.
నిజానికి ఈ తెగువ తన తండ్రి ఎన్టీఆర్ను గద్దె దించే రోజుల్లో బాలయ్య చూపి వుంటే, ఇవాళ చంద్రబాబు చేతిలోకి పార్టీ వెళ్లి వుండేది కాదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
విజయవాడలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొంత మంది టీడీపీ నేతలతో కలిసి బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.
చంద్రబాబును అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. “నేను వస్తున్నాను. ముందుంటాను. తెలుగు వారి పౌరుషం ఏంటో చూపిస్తాం. ఇలాంటివి ఎన్నె తెలుగుదేశం పార్టీ చూసింది” అని ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ రాకపోతే టీడీపీ భవిష్యత్ ఏంటనే చర్చకు తెరలేచింది. లోకేశ్కు పార్టీని నడిపేంత సీన్ లేదనేది సొంత పార్టీ నేతల అభిప్రాయం కూడా.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్థానాన్ని తాను భర్తీ చేస్తానని పరోక్షంగా బాలయ్య చెప్పారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పైగా సోమవారం చంద్రబాబు సీట్లో బాలయ్య కూచుని టీడీపీ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం తెలిసిందే.
బావ చంద్రబాబుకు ప్రత్యామ్నాయం అల్లుడైన లోకేశ్ కాదని, తానే అని బాలయ్య తన చర్యల ద్వారా చెప్పదలుచుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి బాలయ్య హాట్ కామెంట్స్, ఆయన నడవడిక టీడీపీ కేడర్లో అనుమానాల్ని పెంచుతోంది.