స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడు అరెస్ట్ తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అరెస్ట్ అక్రమమని చంద్రబాబును సమర్థించే వాళ్లు అంటున్నారు. అరెస్ట్ సక్రమమని వైసీపీని సమర్థించే వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ మొదలుకుని ప్రతిరోజూ ఆయనపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్, ఆయనను రిమాండ్కు తరలించే సందర్భంలో నగరిలో రోజా సంబరాలు చేశారు. తాజాగా ఆమె కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకు శిక్ష పడాలని స్వామిని కోరుకున్నట్టు ఆమె చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుకు జైలు శిక్ష పడడంతో మొక్కులు చెల్లించుకున్నట్టు రోజా తెలిపారు.
చంద్రబాబుపై అక్రమ కేసు అనే వాదనను ఆమె కొట్టి పారేశారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన కేసుగా ఆమె పంచ్ విసిరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబు, ఇక లోపలే వుంటాడని ఆమె అన్నారు. లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని రోజా హెచ్చరించారు.
బాబు అరెస్ట్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ పిలుపునిచ్చిందని, కానీ భువనేశ్వరి, బ్రాహ్మణిలు మాత్రం పట్టించుకోకుండా హెరిటేజ్ సంస్థను తెరిచారని రోజా అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుపై వరుసగా అనేక కేసులు ముందుకు రానున్నాయని రోజా అన్నారు. ఇంతకాలం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు పబ్బం గడుపుకున్నారని ఆమె విమర్శించారు.